హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రైవేటురంగంలో ఉపాధి కల్పనలో గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక ఏడేండ్లలో ఈజీఎంఎం ద్వారా 74 వేల మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు.. వీరిలో 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లోని 40వేల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం రూ.364 కోట్లు కేటాయించింది. కరోనా లాక్డౌన్, తర్వాత వైరస్ భయంతో యువత అంతగా ఆసక్తి చూపకపోవడంతో శిక్షణ పొందే వారిసంఖ్య తగ్గిపోయింది. 2021-22లో ఇప్పటివరకు 8,613 మంది శిక్షణ పొందారు. శిక్షణలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు, ప్లేస్మెంట్ చూపించే బాధ్యత కూడా శిక్షణ సంస్థలకు అప్పగించారు. టెన్త్ నుంచి ఇంజినీరింగ్ వరకు విద్యార్హతలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 28, 116 శిక్షణా కేంద్రాలు ప్రైవేటు సంస్థలు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రైవేటు శిక్షణ కేంద్రాల్లో అభ్యర్థులను వారే ఎంపిక చేసుకొని.. శిక్షణ ఇచ్చి ప్లేస్మెంట్ సౌకర్యం కల్పిస్తారు. అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లు పాటించాలి. బయోమెట్రిక్ హాజరును అమలుచేయాలి. మూడునెలల్లో ప్లేస్మెంట్ ఇవ్వడంతోపాటు ఆ సంస్థలో కనీసం మూడునెలల పాటు ఉద్యోగం చేస్తేనే ఉపాధి కల్పించినట్టుగా భావించి ప్రభుత్వం శిక్షణ సంస్థలకు బిల్లులు చెల్లిస్తుంది. మూడునెలలో కోర్సులో ఒక్కొక్కరికి రూ.60 వేల వరకు చెల్లిస్తుంది. ఏడాది కోర్సులకు రూ.1.20 లక్షలు, ఆరు నెలల కోర్సుకు సగటున రూ.85-90 వేలు ఇస్తుంది. 2018-19లో అత్యధికంగా 19,352 మందికి శిక్షణ ఇవ్వగా 14,671 మందికి ఉద్యోగాలు కల్పించారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2,533 శిక్షణ ఇవ్వగా ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో శిక్షణ ఇచ్చేవారి సంఖ్యను గణనీయంగా పెంచింది.