హైదరాబాద్, మార్చి 13 : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు పోటీదారులను చూసి కంగారుపడొద్దని నిజాంపేట మున్సిపల్ కమిషనర్ జే శంకరయ్య సూచించారు. మీకు మీరే పోటీ అని నమ్మి ప్రిపరేషన్ కొనసాగించాలని తెలిపారు. మార్కెట్లో దొరికే పుస్తకాలన్నింటినీ ముందేసుకోవద్దని, కొత్తగా కనబడ్డ పుస్తకమల్లా కొనొద్దని సూచించారు. తెలుగు అకాడమీ, ఎన్సీఈఆర్టీ వంటి ప్రామాణిక పుస్తకాలను మాత్రమే చదవాలని కోరారు. 1995లో గ్రూప్ -1 అధికారిగా ఎంపికైన ఆయన, రాష్ట్రమంతటా పలు హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భారీగా నోటిఫికేషన్లు విడుదలచేయనున్న నేపథ్యంలో శనివారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉద్యోగార్థుల ప్రిపరేషన్పై పలు సూచనలు చేశారు.
గ్రూపు డిస్కషన్స్ బెటర్..
అభ్యర్థులు సమయం వృథా అయ్యే స్నేహాలను వదిలించుకోవాలి. ఉద్యోగానికి ప్రిపేరయ్యే వారితో కొత్తగా స్నేహం చేయాలి. రోజుకో సబ్జెక్టు చొప్పున అంతా చదువుకొని గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకోవాలి. హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, మంత్రి హరీశ్రావు పీఎస్ అశోక్రెడ్డి మేమంతా ఒక బ్యాచ్గా ఉండి గ్రూప్ డిస్కషన్లు చేసేవాళ్లం. ఇది మాకెంతో ఉపయోగపడింది. మేం గ్రూప్ -1కి ప్రిపేరైనప్పుడు ఆప్షనల్స్ ఉండేవి. నేను తెలుగుసాహిత్యం, చరిత్ర ఆప్షనల్స్గా ఎంచుకొని విజయం సాధించాను. ఇప్పుడు కామన్ సిలబస్ ఉండటంతో బీటెక్, బీఎస్సీ, ఆర్ట్స్ ఏ కోర్సులు చదివినా అంతా ఒకటే. ఎవరికి అన్యాయం జరిగే అవకాశం లేదు.
ఇంటికి దూరంగా ఉండటమే ఉత్తమం
ప్రిపరేషన్కు ఇళ్లు అనుకూలం కాదు. సాధ్యమైనంత వరకు ఇంటికి దూరంగా ఉండాలి. ఇంటిని, పిల్లలను భార్య, తల్లిదండ్రులకు అప్పగించి ఒంటరిగా సన్నద్ధం కావాలి. బంధువులు షాపింగ్, పిల్లలు, సంసారం, ఫంక్షన్లు, సెంటిమెంట్లను పక్కనబెట్టాలి. కుటుంబం కూడా సహకరించాలి. వీలైనంత వరకు కోచింగ్ తీసుకోవడం మంచిది. సీనియర్లు, జూనియర్లు అంతా పరీక్షను ఎదుర్కోబోతున్నారు. అంతా పోటీదారులే. అందరికీ కొత్తే. పక్కవాళ్లను చూసి కంగారు పడొద్దు. ఇతరులతో మనకు పోటీకాదు. మనకు మనమే పోటీగా భావించాలి. ముఖ్యంగా గ్రూప్ -1 అభ్యర్థులు వ్యాసాలు రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్, వ్యాసాల నిడివి, పదాల సంఖ్యను చూసుకోవాలి. విశ్లేషణాత్మక ధృక్పథం ముఖ్యం.
స్మార్ట్ఫోన్స్ను పక్కనబెట్టండి..
స్మార్ట్ఫోన్లు సమయాన్ని తినేస్తున్నాయి. గతంలో కాలక్షేపం కోసం పుస్తకాలు చదివేవారు. మొబైల్ డాటా ఉన్నదని అత్యధికులు స్మార్ట్ఫోన్లతోనే గడిపేస్తున్నారు. కరోనా తర్వాత నుంచి ఇది మరింత ఎక్కువయ్యింది. అభ్యర్థులు స్మార్ట్ఫోన్లను పక్కనపెట్టేయ్యాలి. సోషల్మీడియా యాప్స్ను తొలగించాలి. అవసరం మేరకే ఉపయోగించుకోవాలి. జంక్ ఫుడ్ తినొద్దు. మాటిమాటికి టీలు తాగొద్దు. పండ్లు, దుంపలు మాత్రమే తీసుకోవాలి. జ్యూస్లు తీసుకోవడం మంచిదే. ప్రిపరేషన్ మీద ధ్యాసతో అరోగ్యాన్ని పాడుచేసుకోరాదు.
ఆగంకావొద్దు..
ఒక చేతిలో ఒక వస్తువు ఉంటే బాగానే ఉంటుంది. ఒక్కో వస్తువును పెంచుకుంటూ పోతుంటే అన్నింటినీ ఒక చేతిలో ఇముడ్చుకోలేం. ఒకటి చేర్చిన కొద్దీ మరొకటి కిందపడిపోతుంది. ఇదే సూత్రం ఉద్యోగాలకు వర్తిస్తుంది. పోలీసు, టీచర్, గ్రూప్స్ వంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఇన్ని నోటిఫికేషన్లను చూసి కంగారు పడొద్దు. అభ్యర్థులు ఉద్యోగాలన్నింటికీ పోటీపడొద్దు. తమ సామర్థ్యం, అభిరుచి మేరకే సన్నద్ధం కావాలి. అయితే కొన్ని కామన్గా ఉంటాయి. ఉదాహరణకు గ్రూప్ -1కు పోటీపడితే సివిల్స్కు, గ్రూప్ -2కు ఉపయోగపడతుంది.
వీటిని చదవండి..
* ప్రతిరోజూ దినపత్రికలు చదవాలి. మొదటి పేజీ నుంచి స్పోర్ట్స్ పేజీ వరకు దేన్నీ వదలొద్దు. అప్డేట్స్ను ఎప్పటికప్పుడు నోట్స్గా రాసుకోవాలి.
* యోజన, తెలంగాణ మాస పత్రికలను క్రమం తప్పకుండా చదవాలి.
* రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పరిణామాలు, మన దేశంపై ప్రభావం, సామాజిక, ఆర్థిక పరిణామాలు, మన దేశం పాత్ర వంటి అంశాలపై అవగాహన తెచ్చుకోవాలి.
* కరోనా ప్రభావం. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు.
* నీతి ఆయోగ్ పనితీరు, సిఫారసులు
* జీడీపీ, దేశ ఆర్థిక వ్యవస్థ
* రాష్ట్ర బడ్జెట్, సామాజిక, ఆర్థిక సర్వే
* జీఎస్టీ అమలు తీరుతెన్నులు
* మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు
* అంతరాష్ట్ర నదీజలాల వివాదం
* ఆజాదీకా అమృత్ మహోత్సవ్
* కేంద్ర రాష్ట్ర పథకాలు, హరితహారం, దళితబంధు, రైతుబంధు, బస్తీ దవాఖాన, కళ్యాణలక్ష్మి వంటి పథకాలు వర్తమాన అంశాలపై సమగ్ర అవగాహన తెచ్చుకోవాలి.