జగిత్యాల, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రవ్యాప్తంగా రూ.2వేల కోట్లకు పైగా స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. ప్రపంచానికి హిట్లర్ ఎంతటి ఫాసిస్ట్ అన్నది తెలుసని, అలాంటి వ్యక్తిని తనకు ఆదర్శమనడం రేవంత్రెడ్డి విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. రానున్న రోజుల్లో హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందని హెచ్చరించారు.
గత ప్రభుత్వం కన్నా మెరుగైన పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను, నిండాముంచారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏ కొనుగోలు కేంద్రంలోనూ రైతులకు రసీదులు ఇవ్వలేదని తెలిపారు. తాను పండించిన ధాన్యం 544 బ్యాగులుగా, 218 క్వింటాళ్లుగా తూకం వేసిన అధికారులు.. ట్రక్ షీట్పై 190 క్వింటాళ్లు అని పేర్కొన్నారని వివరించారు. ఈ లెక్కన తన ధాన్యానికే క్వింటాల్కు ఐదు కిలోల చొప్పున మొత్తం 28 క్వింటాల ధాన్యం కోత విధించారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారని, ఈ లెక్కన ఒక్క జగిత్యాల జిల్లాలోనే రూ.125 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు.
రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే, రైతులకు ట్రక్షీట్ల ప్రకారం కాకుండా వారి ధాన్యానికి సంబంధించిన బరువు తూచే ధర్మకాంటా తూకం ప్రకారంగా డబ్బులు చెల్లించాలని కోరారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారని గుర్తుచేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అని, ఆమెపై తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ నాయకులే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీనికి వెనుకాల కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే ఉన్నారని అనుమానం వ్యక్తంచేశారు.