Jeevan Reddy | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన సేకరణ మీద ఉన్నంత ధ్యాస.. ధాన్యం సేకరణ మీద లేదు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. రూ. 1450 కోట్ల వడ్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవన్లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ అని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిది స్కీమ్ల పాలన కాదు అని స్కామ్ల పాలన అని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ 7,429 కొనుగోలు కేంద్రాలు పెడితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి 5 వేల దాకా మాత్రమే పెట్టారు. దీంతో రైతులు ఆగమై పోతున్నారు. ధన సేకరణ మీద పెట్టిన దృష్టి ధాన్యం సేకరణ మీద కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం లేదు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీనే అని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి 420 స్కీములు డిసెంబర్ 9 కే ఇస్తామని చెప్పి డైవర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో 25 పథకాలు ఇస్తామని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు మరిచిపోయేలా రేవంత్ చేష్టలు ఉన్నాయి. రాహుల్ గాంధీ,రేవంత్ రెడ్డి పేరిట ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో 1450 కోట్ల వడ్ల కుంభకోణం జరిగింది. 35 లక్షల మెట్రిక్ టన్నులు అమ్ముకున్నారు. రూ. 2183 మద్దతు ధర ఉంటే రూ. 1900 కే అమ్మారు. ఎమ్మాస్పీ కంటే తక్కువ ధరకు అమ్మారు. ఈ గ్లోబల్ టెండర్లు ఆంధ్రవాళ్లకు వచ్చినయి. ఈ గ్లోబల్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల వాటా ఎంతో చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ వడ్ల స్కామ్ మీద సీబీఐ, ఈడీ సుమోటోగా కేసు నమోదు చేసి ఎంక్వయిరీ వేయాలన్నారు జీవన్ రెడ్డి. దీని మీద మేం కూడా సీబీఐ ,ఈడీకి లెటర్ రాస్తామన్నారు. బీజీపీ కూడా దీని మీద నోరు మెదపడం లేదు బీజీపీ వాళ్ళ వాటా కూడా ఎంతో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు కొన్నాం. కానీ రేవంత్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. హస్తం అంటే అవినీతి నేస్తం అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.