హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్ తొలివిడత (సెషన్-1) ప్రవేశ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరుకానుండగా, రాష్ట్రం నుంచి 50 వేల మంది రాయనున్నారు. తొలివిడత పరీక్షలు ఈ నెల 24న ప్రారంభమై ఫిబ్రవరి 1వ తేదీతో ముగుస్తాయి. రెండోవిడత ఏప్రిల్ 6 నుంచి వారంపాటు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా జూన్ 4న జరిగే అడ్వాన్స్ పరీక్షకు అర్హత కల్పిస్తారు. కాగా, గత ఏడాది గణితం ప్రశ్నలు ర్యాంకులను నిర్దేశించగా, ఈ ఏడాది మెయిన్ ఎలా ఉంటుందోనన్న ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతున్నది.
రోజుకు రెండు షిప్ట్లలో..
జేఈఈ మెయిన్ రోజుకు రెండు షిప్ట్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి షిప్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో షిప్ట్ పరీక్షలు జరుగుతాయి. బీఆర్క్, బీ ప్లానింగ్ ప్రవేశాల కోసం ఈ నెల 28న రెండో షిఫ్ట్ (మధ్యాహ్నం 3 గంటల నుంచి 6:30)లో పరీక్ష నిర్వహిస్తారు.
ఇవీ నిబంధనలు
విద్యార్థులను మొదటి షిఫ్ట్ పరీక్షకు ఉదయం 7 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 1 గంట నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించరు.
పరీక్ష కేంద్రంలో విద్యార్థికి కేటాయించిన సీట్లోనే కూర్చోవాలి. ఒకవేళ సీటును మార్చుకొనే సాహసం చేసినా, మరో సీట్లోకి మారినా పరీక్ష రాయడానికి అనుమతించరు.
కంప్యూటర్పై ప్రత్యక్షమైన ప్రశ్నపత్రం తమకు చెందినదిగా నిర్ధారించుకోవాలి. సబ్జెక్టు మారితే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా వెంటనే తెలియజేయాలి.
అభ్యర్థి ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైనా, తప్పుడు సమాచారం ఇచ్చినా, ఒకటి కంటే ఎక్కువ షిప్ట్లలో పరీక్షకు హాజరైతే అతడిని అనర్హుడిగా ప్రకటిస్తారు.