హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -1 పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పూర్తిగా విఫలమైంది. పరీక్షలను సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేసింది. హైదరాబాద్లోని పలు పరీక్షా కేంద్రాల్లో సర్వర్డౌన్ సమస్యలు తలెత్తాయి. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సాంకేతిక సమస్యలతో పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమైనా, ప్రశ్నలు కనిపించక విద్యార్థులు అవస్థలు పడ్డారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ -1 పరీక్షలు గురువారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్లో పరీక్షలు నిర్వహించారు. గురువారం మేడ్చల్లోని ఓ పరీక్షా కేంద్రంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో గంటన్నర ఆలస్యంతో పరీక్ష ప్రారంభమైంది. శుక్రవారం మూసారాంబాగ్, అబిడ్స్లోని అరోరా కాలేజీ పరీక్షా కేంద్రాల్లో సర్వర్డౌన్ సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశాయి.
వాస్తవానికి శుక్రవారం ఉదయం 9 గంటలకే పరీక్ష ప్రారంభించాలి. కానీ, మూసారాంబాగ్లోని అరోరా కాలేజీ కేంద్రంలో 11 గంటలకు కూడా నిర్వహించలేదు. ఈ కేంద్రంలో 225 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉన్నది. 135 మంది విద్యార్థులను కేంద్రం బయటే నిలిపివేశారు. సాంకేతిక సమస్యల కారణంగా అడ్మిట్కార్డులు స్కాన్ కాకపోవడంతో వీరిని లోపలికి అనుమతించలేదు. పరీక్ష సకాలంలో ప్రారంభంకాకపోవడం, కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఎట్టకేలకు రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష ప్రారంభంకాగా, అదనంగా రెండు గంటలు రాసుకొనే అవకాశానిచ్చారు.
అబిడ్స్లోని అరోరా కాలేజీ పరీక్షా కేంద్రంలోనూ సర్వర్డౌన్ సమస్య తలెత్తింది. సాంకేతిక సమస్యలతో ఉదయం 10 : 30 గంటలకు ప్రశ్నపత్రం అందుబాటులోకి వచ్చింది. ఇక 90 ప్రశ్నలకు 26 ప్రశ్నలు సరిగ్గా కనిపించలేదని ఓ విద్యార్థిని వాపోయారు. దీనికి సర్వర్లో సాంకేతిక సమస్య కారణమంటూ ఇన్విజిలేటర్లు చేతులెత్తేశారు. రీ ఫ్రెష్ బటన్ నొక్కినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. మధ్యాహ్నం సైతం సర్వర్డౌన్ సమస్య తలెత్తింది. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహంతో ఎన్టీఏ డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాలు శుక్రవారం కాస్త సులభంగానే వచ్చాయి. రెండు పేపర్లు మధ్యస్తంగా ఉన్నట్టు నిపుణులు పేర్కొన్నారు. రెండు పేపర్లలో కెమిస్ట్రీ సులభంగా ఉంది. 50 శాతానికి పైగా ప్రశ్నలు ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచే వచ్చాయి. గణితం కఠినంగా అనిపించింది. న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల నిడివి పెద్దగా ఉండటంతో చదివేందుకు సమయం పట్టింది. ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన రెండు పేపర్లు ఒకే తరహాలో ఇచ్చారని, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్వాలేదని శ్రీచైతన్య ఆలిండియా ఐఐటీ కో ఆర్డినేటర్ ఎం ఉమాశంకర్ చెప్పారు. గత ఏడాదితో పోల్చితే పేపర్లు ఈజీగా అనిపించినా, నెగెటివ్ మార్కింగ్ ఉండటం ప్రభావం చూపుతున్నదని నిపుణులు అభిప్రాయపడ్డారు.