హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడిగా, ఉద్యమ భావజాల వ్యాప్తికోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జన హృదయాల్లో సదా నిలిచిఉంటారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురసరించుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగపూరిత సేవలను స్మరించుకున్నారు. సబ్బండవర్ణాల సమగ్రాభివృద్ధి కోసమే తెలంగాణ స్వరాష్ట్రం అని తెలిపిన జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ఒకొకటిగా నెరవేరుస్తున్నదని చెప్పారు. రాష్ట్రాన్ని సాధించిన ఏడేండ్లలోనే సాగునీరు, వ్యవసాయం వంటి పలు రంగాలను తీర్చిదిద్దుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు. అదే వరుసలో సకల జనుల సమున్నతాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని తెలిపారు. మిషన్ కాకతీయ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు, రైతుబంధు నుంచి దళితబంధు వరకు అనేక వినూత్న పథకాలను అమలుచేస్తున్నదని పేర్కొన్నారు. ఆర్థిక సామాజికరంగాల్లో అభివృద్ధిని సాధించి దళిత బహుజన సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరిగేలా, సమసమాజ స్థాపన దిశగా బంగారు తెలంగాణ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తున్నదని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.