JP | ఎన్నికల్లో గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ దేశ భవిష్యత్తును పణంగా పెడుతున్నదని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఓ టీవీ చానల్లో జేపీతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, దేశ, రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికలు తదితర అంశాలపై కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు జేపీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నేను చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను. కాంగ్రెస్ నాయకులతో అగ్రస్థాయిలో నాకు మంచి సంబంధాలున్నాయి. నేను జాతీయ సలహా మండలిలో పనిచేశాను. పరిపాలనా సంస్కరణ సంఘంలో పనిచేశాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భయానికి గురై.. ఎన్నికల్లో గెలిచేందుకు దేశ భవిష్యత్తును కూడా పణంగా పెట్టే పరిస్థితికి వచ్చింది. నేను ఆవేదనతో చెప్తున్నా.. ఆ పార్టీ అనేక చర్యలు అలానే ఉన్నాయి. ఉదాహరణకు ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్)పై కేసీఆర్గారు పరిశీలించి అటు ప్రజలకు, ఉద్యోగులకు న్యాయం అయ్యేట్టు చేద్దామన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం ఓపీఎస్ ఇచ్చేస్తామని చెప్పింది.
కొన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఓపీఎస్ను అమలుచేస్తున్నారు. బ్యాలన్స్ తీసుకురాకపోతే కచ్చితంగా ఆ రాష్ట్రాలు నాశనమైపోతాయ్’ అని జేపీ వ్యాఖ్యానించారు. ‘మన చర్యలవల్ల దేశమే ఓడిపోయేటైట్టెతే ఎవరు గెలుస్తారని సాక్షాత్తూ నెహ్రూ చెప్పారు. నేను గెలవడంకోసం దేశం సర్వనాశనం అయిపోయినా ఫర్వాలేదనే పరిస్థితి తేవడం ప్రమాదకరమని అన్నారు’ అని జేపీ గుర్తు చేశారు. నేడు నిరాశతో ఉన్న వర్గాలకు ఉత్సాహాన్ని, నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉన్నదని, దీర్ఘకాలంలో ఆదాయాలు పెరిగి, ఉపాధి కల్పన జరిగే ఏర్పాట్లు లేకుంటే రాష్ట్ర, దేశ భవిష్యత్తు అంధకారమవుతుందని ఆయన హెచ్చరించారు.