Minister KTR | జవహర్నగర్లో దుర్గంధ సమస్యను గత ప్రభుత్వాలు వారసత్వంగా ఇచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. జవహర్నగర్లో ఏర్పాటు చేసిన లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం 3,619 మంది లబ్ధిదారులకు జీవో నెం.58కింద పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉండి అభివద్ధి చేయలేదని.. అలాంటిది ఇప్పుడు అవకాశం ఇస్తే ఎలా చేస్తారని ప్రశ్నించారు. వాళ్లను అసలు నమ్మకండి అని సూచించారు.
నగరంలోని చెత్త సమస్యను తీర్చేందుకు జవహర్నగర్లో డంపింగ్ యార్డ్ అయితే పెట్టిండ్రు కానీ తదననంతరం ఏం చేయాలి? ఆరోగ్యపరంగా సమస్యలు రాకుండా ఏం చేయాలనేది పూర్తిగా అయితే చేయలేదు. చెత్తకుప్పలు పోసి, దుర్గంధం వచ్చేటట్టు చేసి ఆ సమస్యను మాకు వారసత్వంగా అప్పజెప్పి పోయిండ్రు. 2014లో వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ దీనిపై మొత్తం అధ్యయనం చేశారు. జవహర్నగర్లో ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది. అక్కడ వేల, లక్షల టన్నుల చెత్త డంప్ చేయబడి ఉంది. దీన్ని ఏం చేస్తే ఆ ప్రాంత ప్రజలకు విముక్తి కలుగుతుంది అని ఆలోచించారు. దీనికి శాస్త్రీయంగా అత్యుత్తమ పద్ధతులు ఏం ఉన్నాయి? వాటికి అనుగుణంగా చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చారు. మేం కూడా దీనిపై లెక్కలు తీసుకున్నం. జవహర్నగర్ డంపింగ్ యార్డ్ మొదలుపెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి 3వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని లెక్క వేసిండ్రు. దానికోసమే ఈ ప్లాంట్ డిజైన్ చేశారు. కానీ ఇప్పుడు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది. ఇంకో వెయ్యి టన్నులు అయితే మూడు రెట్ల చెత్త అవుతుంది. అందుకే ఆలోచన చేసినం. ఆలోచన చేసి మూడు నాలుగు పనులు మొదలు పెట్టినం.
మన ఇంట్లో రెండు రకాల చెత్తలు ఉంటాయి. ఒకటి తడి చెత్త.. ఇంకోటి పొడి చెత్త. ప్రస్తుతం జవహర్నగర్ తీసుకొచ్చిన చెత్తలో తడి చెత్త నుంచి ఎరువు ఉత్పత్తి చేసి.. దాన్ని రైతులకు అమ్ముతున్నం. పొడి చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నం. రూ.550 కోట్లతో దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే యూనిట్ను గతంలో ప్రారంభించినం. దాన్ని నేనే ప్రారంభించిన. 20 మెగావాట్ల విద్యుత్తును ఇక్కడి చెత్త నుంచి ఉత్పత్తి చేస్తున్నం. ఇప్పుడు దానికి రెండో దశ కొనసాగుతోంది. మరొక రూ.550 కోట్లతో మరో 28వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఇక్కడ స్థాపించబడుతోంది. దానివల్ల ఒక్క జవహర్నగర్ నుంచే 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. హైదరాబాద్ మొత్తం నుంచి వచ్చే చెత్తతో 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడమే మా లక్ష్యం. దీనివల్ల ఏం అవుతుంది అంటే.. తడి చెత్త మొత్తానికి మొత్తం ఎరువు ఉత్పత్తి చేయొచ్చు. పొడి చెత్త ఉంటే దాని నుంచి కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు. దానివల్ల భవిష్యత్తులో గుట్టలుగుట్టలుగా చెత్త పేరుకుపోయే పరిస్థితి ఉండదు.
ఈ రెండు కాకుండా మూడో రకం చెత్త కూడా వస్తుంది. ఇండ్లు కట్టినప్పుడు, కూలగొట్టినప్పుడు కంకర, రాళ్లు, మట్టి ఎక్కడపడితే అక్కడ కుప్పలు కుప్పలు పోసి ఉంటాయి. దాన్ని వ్యర్థంగా వదిలిపెట్టొద్దు. దానివల్ల నాలాలు కూరుకుపోతున్నయి. దీనివల్ల ఇండ్లళ్లకు నీళ్లు వస్తున్నాయి. కిందకు నీళ్లు పోయేటందుకు తొవ్వ లేకుండా అవుతుందని ఇప్పటికే రెండు ప్లాంట్స్ పెట్టినం. దీన్ని కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ అంటారు. నిర్మాణం, శిథిలాల నుంచి వచ్చే ఈ వ్యర్థాలను పునరుత్పత్తి చేసి.. పునర్వినియోగం చేసి.. వాటి నుంచే సిమెంట్, బ్రిక్స్, ఫుట్పాత్ మీద వేసే టైల్స్ తయారుచేస్తున్నం. కంకర నుంచి డస్ట్ తయారుచేస్తున్నం. దీనివల్ల ఈ చెత్త కూడా మొత్తానికి మొత్తం వినియోగంలోకి వచ్చి.. ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్త లేకుండా అవుతుంది. ఇప్పటికే ఇలాంటివి రెండు ప్లాంట్లు పెట్టినం. ఒకటి ఫతూల్గూడలో, రెండోది జీడిమెట్లలో పెట్టినం. ఈ రెండూ కూడా ఒక్కోటి 500మెట్రిక్ టన్నుల కెపాసిటీతో నడుస్తున్నయి. ఇంకో రెండు కూడా పెట్టబోతున్నం.
నాలుగో రకం వేస్ట్ ఏంటంటే.. మురికి నీరు. హైదరాబాద్ మహానగరంలో రోజుకు దాదాపు 2వేల ఎంఎల్డీ ( 2వేల మిలియన్ లీటర్ల ) మురికినీరు ఉత్పత్తి అవుతుంది. 100 శాతం ఎస్టీపీలతో ఈ జూలై నెలకల్లా హైదరాబాద్ భారతదేశంలోనే మొట్టమొదటి నగరం కాబోతున్నది. హైదరాబాద్ దేశానికే ఆదర్శం కాబోతున్నది. దీనికోసం 4 వేల కోట్లు ఖర్చుపెడుతున్నం.
జవహర్నగర్ గుట్ట మొత్తం చెత్తతో నింపేసిండ్రు. ఆ గుట్ట మీద వానలు పడి.. నీళ్లు ఇంకి ఇంకి చెత్త నుంచి కిందకు వచ్చి.. రసాయనంలా కలుషితంగా మారి మల్కారం చెరువులోకి వచ్చింది. దీంతో నీళ్లు మొత్తం కలుషితమై నల్లగా మారింది. నల్లగా మారిన ఆ మల్కారం చెరువును తెల్లగా చేసేందుకు కొత్తగా లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకొచ్చాం. చెత్త నుంచి వచ్చిన రసాయనాలతో నల్లగా మారిన నీటిని శుద్ధి చేసేందుకు 250కోట్లతో మల్కారం చెరువుపై మిషనరీ పెట్టినం. దాన్ని ఇవాళ ప్రారంభించినం. సంవత్సరం, సంవత్సరంన్నర లోపల మల్కారం చెరువును శుద్ధి చేసి కిందకు మంచినీటిని పంపిస్తం. దీనివల్ల భూగర్భ జలాలు కూడా మంచిగ అవుతాయి. 550 కోట్లతో కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టినా.. 250 కోట్లతో మంచి నీటిని శుద్ధి చేసే ఈ ప్లాంట్ పెట్టిన, మరో 550 కోట్లతో విద్యుదుత్పత్తి చేసే రెండోదశ ప్లాంట్ పెడుతున్నా.. దేనికోసమంటే.. ఏ దేశమైన అభివృద్ధి బాటలోకి రావాలంటే నాగరికంగా బతికే విధంగా పద్ధతులు నేర్చుకోవానే ఉద్దేశంతోనే. నేను జపాన్ దేశం పోయిన, జపాన్ అంటే ప్రపంచంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలతో ఉండే నగరం. అక్కడ ఇట్లగే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ దగ్గరికి పోయిన. అక్కడ పైన ఏమో పార్క్ ఉంది. ప్లాంట్ ఏమో కింద ఉంది. అక్కడ ఏ మాత్రం వాసన లేదు. ఈ రోజు కాకపోయిన ఏడాదికో, 18 నెలలకో జవహర్నగర్లో, దమ్మాయిగూడలో, నాగారం గూడలో కూడా అదేవిధంగా చేస్తాం. వారసత్వంగా వచ్చిన ఈ సమస్యకు పరిష్కారం చూపి ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉండేవాళ్లకు మంచి నీళ్లు, మంచి గాలి అందించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తాం.
మొత్తం చెత్త ఇక్కడే పోస్తే ఎట్ల. 3వేల టన్నుల కోసం ఏర్పాటు చేసిన డంప్ యార్డ్.. 8వేల టన్నుల చెత్తను ఎట్ల హ్యాండిల్ చేస్తదని అందరిలో ఒక ప్రశ్న ఉంటుంది. అందుకోసమే దుండిగల్ దగ్గర 1500 టన్నుల చెత్తను అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నం. మరో 1500 టన్నుల చెత్తను ఇంకో ప్లేస్కు తరలిస్తాం. ఇవన్నీ ప్లాంట్లు పెట్టినందుకు, కరెంట్ ఉత్పత్తి చేసినందుకు, ఇక్కడ ఎరువు తయారుచేసినందుకు, లీషెట్ ప్లాంట్ పెట్టినందుకు భవిష్యత్తులో ఇక్కడ లోడ్ తగ్గుతుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఉండే జనాలకు ఇబ్బందులు తప్పుతాయి. నగరానికి ఉండే పెద్ద సమస్యను జవహర్నగర్, దమ్మాయిగూడ ప్రజలు హ్యాండిల్ చేస్తున్నారు. వీళ్లకు ఎంత చేసిన తక్కువే అని అభిప్రాయపడ్డారు. రూ.92కోట్లతో రోడ్లు, మురికికాల్వలు నిర్మించాం. ఫిర్జాదిగూడలో 10 ఎకరాల్లో మూడు మతాలకు సంబంధించిన ఖబరిస్తాన్, వైకుంఠధామం, సిమెట్రీ ఒకటే దగ్గర కట్టిండ్రు. అదేవిధంగా జవహర్నగర్లో 15 ఎకరాల్లో అలాగే కడుతాం. మంత్రి మల్లా రెడ్డి కోరినట్లు పదెకరాలు, పదిహేనెకరాల్లో మరో ఆరు నెలల్లో మంచి పార్కు నిర్మిస్తాం. అని మంత్రి కేటీఆర్ తెలిపారు.