హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది భక్తులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన పలువురు భక్తులు సైతం అమర్నాథ్ యాత్రలో చిక్కుకుపోయారు. జనగామ జిల్లాకు చెందిన తాడూరి రమేశ్, జిల్లా సత్యనారాయణ, పల్లెల లక్ష్మీనరసయ్య, సిద్ధి లక్ష్మి దంపతులు చిక్కుకుపోయారు.
నలుగురు ఈ నెల 3న ఢిల్లీకి బయలుదేరారు. అక్కడి నుంచి మరో ట్రైన్లో జమ్మూ వరకు వెళ్లారు. ఆ తర్వాత వాహనంలో పహిల్గామ్ వెళ్లి.. అక్కడి నుంచి కాలినడకన అమర్నాథ్ వద్దకు చేరుకున్నారు. కిలోమీటర్ దూరంలో ఉన్న సమయంలో వరద నీరు పోటెత్తడంతో ఆర్మీ యాత్రను నిలిపివేస్తున్నట్లు ఆర్మీ జవాన్లు తెలిపారంటూ బంధువులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రాత్రంతా చిమ్మచీకట్లో భయం భయంగా గడిపినట్లు శనివారం ఫోన్ ద్వారా బంధువులకు తెలిపారు.
అలాగే జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన, పట్టణానికి చెందిన పోతుగంటి శ్రీనివాస్గౌడ్, గడ్డం శ్రీనివాస్, మహేందర్తో పాటు సుమారు ఆరుగురు మిత్రులు కలిసి అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. సాయంత్రం గుహ వద్ద జరిగిన వరద ప్రవాహానికి దగ్గరలోనే ఉన్నామని, తమ కళ్ల ఎదుటే ప్రమాదం జరిగిందని బంధువులకు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం భద్రతా బలగాలు తమను సురక్షిత ప్రాంతానికి తరలించిందని, తామంతా క్షేమంగానే ఉన్నట్లు సమాచారం ఇచ్చారు.