హాలియా, ఏప్రిల్ 12: జానారెడ్డి 17 ఏండ్లు మంత్రిగా పని చేసినా సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు. ప్రజల ముందుకొచ్చి ఓట్లు అడిగేందుకు ముఖం లేకనే ఎన్నికల ప్రచారం వద్దంటున్నాడని తెలిపారు. సోమవారం అనుముల మండలం పాలెం, చింతగూడెం, రామడుగు, యాచారం, మారేపల్లి, పులిమామిడి, శ్రీనాథపురం గ్రామాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భం గా తలసాని మాట్లాడుతూ.. ప్రజల కోసం పాటుడుతూ అకస్మాత్తుగా మృతిచెందిన నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కోసం పోటీ నుంచి తప్పుకుంటే జానారెడ్డికి మరింత గౌరవం వచ్చేదన్నారు. భగత్ పరుగెత్తగల గుర్రం, జానారెడ్డి పనైపోయిన గుర్రమని.. ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. నోముల భగత్ను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతందని, జానారెడ్డికి ఓటేస్తే ఇక్కడి ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ధ్వంసమైన కుల వృత్తులకు టీఆర్ఎస్ పాలనలోనే పూర్వవైభవం వచ్చిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా ఉండేదని, వ్యవసాయానికి ఆరు, గృహాలకు 12 గంటల కరెంట్ వచ్చేదని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ కృషితో నేడు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.
సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. సోమవారం తిరుమలగిరి(సాగర్) మండలం పిల్లిగుండ్లతండాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు హరినాయక్తోపాటు 10 కుటుంబాల వారు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పెద్దవూర మండలం తుంగతుర్తికి చెందిన 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. త్రిపురారంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే శంకర్నాయక్ సమక్షంలో బీజేపీ నాయకులు, యువకులు 60 మంది గులాబీగూటికి చేరారు. నిడమనూరు మం డలం ముప్పారంలో బీజేపీకి చెందిన 50 కు టుంబాల వారు, నిడమనూరు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎమ్మెల్యే భాస్కర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఓటు అనే ఆయుధంతో నోముల భగత్ను గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొని మీ తలరాతను మార్చుకోవాలని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాకముందు మన బతుకులు ఎట్లా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పాలనలో రూ. 200 పింఛన్ వస్తుండే.. ఇప్పుడు వృద్ధు లు, ఒంటిరి మహిళలకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 అందిస్తున్నామని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి ఏమీ చేయలేదని, ఎవరికైనా ఆపద వస్తే ఆదుకోలేదని విమర్శించారు. ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తాడని ప్రశ్నించారు. నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తనయుడు అమిత్రెడ్డి పాల్గొన్నారు.
ఏబీవీపీ నాయకుడి ప్రకటన
తిరుమలగిరి సాగర్, ఏప్రిల్ 12 : నెల్లికల్ లిఫ్ట్పై మంత్రి జగదీశ్రెడ్డి భరోసా ఇచ్చినందుకు తన ఓటు టీఆర్ఎస్కే వేస్తానని ఉస్మానియా యూనివర్సిటీ ఏబీవీపీ లీగల్ సెల్ కన్వీనర్ బ్రహ్మారెడ్డి ప్రకటించా రు. సోమవారం ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం నెల్లికల్లో ఓ వీడియో విడుదల చేశారు. ‘మా తాతల కాలం నాడు నాగార్జునసాగర్ నిర్మించారు. నాలుగో తరానికి చెందిన వాడిని నేను. మా ఊరు సాగర్ను ఆనుకొని ఉంటుంది. తలాపున నది ఉన్నా లాభం లేదు.. ముఖ్యమంతి కేసీఆర్ మా కలను సాకారం చేసే విధంగా లిఫ్ట్కు శంకుస్థాపన చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ఊరికి వచ్చిన మంత్రి జగదీశ్రెడ్డి 18 నెలల్లోపు పూర్తి చెయ్యకపోతే రాజీనామా చేస్తామని హామీ ఇచ్చారు. నాకు కావాల్సింది నెల్లికల్ లిఫ్ట్ పూర్తి చెయ్యడమే.. నాకు సీఎం కేసీఆర్ మీద భరోసా ఉంది. అందుకే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నా’నని ఏబీవీపీ నేత బ్రహ్మారెడ్డి ప్రకటించారు.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తామని సీపీఎం, సీపీఐ నాయకులు ప్ర కటించారు. సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోము ల భగత్కుమార్ను గెలిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కూన్రెడ్డి నాగిరెడ్డి సోమవారం వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. తమ పార్టీ శ్రేణులు, అభిమానులు కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నియోజకవర్గ కమిటీల్లో చర్చించిన అనంతరమే మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు వారు ప్రకటించారు. ఈ రెండు లెఫ్ట్ పార్టీల నిర్ణయాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు స్వాగతించారు.