నాగర్కర్నూల్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కృష్ణా నీటి వాటా తేల్చరు? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు? పాలమూరు అంటే ఎందుకంత చిన్నచూపు? తెలంగాణపై వివక్ష ఎందుకు? అని ప్రధాని నరేంద్ర మోదీని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రశ్నించారు. పదేండ్ల ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా శనివారం నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పోతురెడ్డిపల్లిలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తామని గత ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మభ్యపెట్టేందుకే పర్యటన అంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజలను మోసం చేయాలని చూస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్కు, సీఎంగా కేసీఆర్కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.