హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం మహోన్నతమైనదని శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామీజీ ప్రశంసించారు. ‘ఊరిఊరికో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మిచెట్టు’ కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు వృక్షవేదం పుస్తకం, జమ్మి మొక్కను స్వామీజీకి అందజేశారు. అనంతరం మఠం సీఈవో పద్మశ్రీ డాక్టర్ వీఆర్ గౌరీశంకర్, సాధువులు, పూజారులు, ఇతర భక్తులతో కలిసి జమ్మి మొక్కను నాటారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని కాపాడాలనే ఆలోచన అద్భుతమైనదని కొనియాడారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ బాధ్యులు కరుణాకర్రెడ్డి, రాఘవ పాల్గొన్నారు.