అమీర్పేట్, ఫిబ్రవరి 4 : కులగణన పేరుతో బీసీల సంఖ్యను(BC population) తక్కువ చేసి చూపిస్తే.. గద్దెనెక్కేందుకు దోహద పడ్డ బీసీలే కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్ (Jajula Srinivas Goud)హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టడంలో తగిన ప్రామాణికాలు పాటించలేదని, ఫలితంగా బీసీల సంఖ్య తప్పుల తడకగా వచ్చిందని, ఈ విషయాన్ని గత సెన్సస్ వివరాలతో పోల్చి చూస్తే స్పష్టంగా తెలుస్తోందన్నారు. బీసీ కులగణన నివేదికలో ఊహించని విధంగా దొర్లిన తప్పిదాలను 48 గంటల్లో సరిదిద్ది, సరి చేసిన నివేదిక వివరాలను పబ్లిక్ డొమెయిన్లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు రిజర్వేషన్లను అమల్లోకి తీసుకువాల్సిందేనని స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో వివిధ బీసీ సంఘాలు, మేధావులతో కలిసి మంగళవారం బేగంపేట్లోని హోటల్ హరిత ప్లాజాలో బీసీ సంఘాల సదస్సులో తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు కుందారం గణేష్చారి, బీసీ నాయకులు బాలరాజ్ గౌడ్ సహా వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే..
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కులగణనలో బీసీలను తక్కువ చేసి చూపించడమంటే బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, తమ సంఖ్యను తక్కువ చేసి చూపడం వల్ల బీసీ బిడ్డలు ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులగణనలో వాస్తవ వివరాలను వెల్లడించేందుకు కాంగ్రెస్ జంకుతోందని, గతంలో నెహ్రూ కాంగ్రెస్ బీసీలకు చేసిన అన్యాయాన్ని, రాహుల్ కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా చక్కదిద్దుతోందని భావించామన్నారు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన రెడ్డి మార్క్ డీఎన్ఏ నుంచి ఇంకా బయటపడలేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. బీహార్లో జరిగిన విధంగా బీసీల కులగణన జరిగేందుకు వీలుగా బీసీ మేధావులు చేసిన సూచనలు, సలహాలను పాలనానుభవం లేని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఒక రాష్టంలోనే బీసీల కులగణన చేయలేకపోతున్న కాంగ్రెస్, ఇక దేశ వ్యాప్తంగా ఏం చేస్తుందని రాహుల్ వ్యాఖ్యలను తప్పికొట్టారు.
బీసీ మంత్రిది సమాచార లోపం..
తెలంగాణ బీసీ సంక్షేమ మంత్రి పొన్నంతో కలిసి తాను పాల్గొన్న ఓ సమావేశంలో.. కులగణన సర్వేలో పాల్గొనని వారికి, తమ అభిప్రాయాలు చెప్పే అధికారం లేదంటూ మాట్లాడడం మంత్రి హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్కు సరికాదని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. ఒక రాష్ట్రానికి బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన తన ఇంటికే సర్వే నిర్వహిస్తున్న ప్రతినిధులు రాలేదని, తానే జోనల్ కమిషనర్కు పలు మార్లు ఫిర్యాదులు చేసిన తరువాతే తన ఇంటికి సంబంధిచిన సర్వే జరిగిందని వివరించారు. తనకే ఇటువంటి పరిస్థితి ఉంటే, ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చన్నారు.
నివేదిక ప్రతుల చించివేత..
ఈ సదస్సులో భాగంగా తప్పుల తడకగా ఉన్న బీసీ కులగణన సర్వే ప్రతులను చించివేసి బీసీ ప్రతినిధులు తమ నిరసనను వ్యక్తం చేశారు. బీసీ కులగణన చేపట్టిన విధానమే తపుపల తడకగా మారిందని, తొలుత జీవోలతో ఆ తరువాత కమిషన్ల నియమాకాలతో కులగణనలో కీలకమైన బీసీ కుటుంబాల సంఖ్యను నిర్ధిష్టంగా తేల్చలేదని, ఈ సర్వేలో సంచార జాతులకు కూడా పరిగణలోకి తీసుకోలేదని వక్తలు పేర్కొన్నారు.
6న భవిష్యత్ కార్యాచరణపై సమావేశం..
బీసీ కులగణనలో దొర్లిన తప్పులను సరి చేయని పక్షంలో ఈ నెల 6న వివిధ బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహిస్తామని జాజుల శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీ ప్రతినిధులు, మేధావులంతా కలిసి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.