హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఇటీవల నియమించిన ప్రభు త్వ సలహాదారుల్లో కాంగ్రెస్ బీసీలకు ఒకరికీ అవకాశం కల్పించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలిచ్చే అర్హత బీసీలకు లేదా?బీసీల సలహాలు ప్రభుత్వానికి అక్కర్లేదా? అని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని, మంత్రివర్గంలో ఇద్దరికే అవకాశం కల్పించారని, అడ్వకేట్ జనరల్గా, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా బీసీలకు ఒకరికీ అవకాశం కల్పించలేదని ధ్వజమెత్తారు. కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ బీసీలకు అవకాశాలు ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ ఆలోచించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ వివిధ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం దామాషా పద్ధతిలో పాలనలో భాగస్వామ్యం కల్పించాలని ఒకవైపు చెబుతంటే , అందుకు విరుద్ధంగా తెలంగాణ సర్కారు ఏకపక్షంగా ఒకే కులం వారికి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ఇకనైనా మంత్రివర్గ విస్తరణలో బీసీలకు దామాషా పద్దతిన స్థానం కల్పించాలని, నామినేటెడ్ పోస్టులను 50 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు.