నల్లగొండ : నాలేడ్జి ఉంటే గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి ఎదగవచ్చని దివంగత మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి నిరూపించారు. ఆయన చదువుకున్న కళాశాల ప్రాంగణంలో ఆయన జ్ఞాపకార్ధం గ్రంథాలయాన్ని నిర్మించడం గొప్ప విషయం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి స్మారక గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. జైపాల్ రెడ్డి పేరుమీద నిర్మించిన భవనాన్ని ఆయన సమకాలికుడు కే కేశవ రావుచేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం ఆనందంగా ఉందన్నారు.
విద్య ఉంటే ఎంతటి కష్టాలను అయిన జయించవచ్చు. మెరుగైన విద్యను అందించడంతోనే రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయగలం అనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని గుత్తా తెలిపారు. నేటి యువత ఆదర్శ నేతలను స్ఫూర్తిగా తీసుకుని వారు ఎంచుకున్న రంగాల్లో విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమలో..రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహ, దేవరకొండ ఎంపీపీ జానీ యాదవ్, పీఏ పల్లి ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.