నల్లగొండ ప్రతినిధి, జూన్ 13 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. సామాన్యుల జీవితాలతో పెనవేసుకుపోయిన విద్యుత్తు వ్యవస్థ ప్రభుత్వ పరిధిలో ఉంటేనే అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. గతంలో కేసీఆర్పై కేంద్రప్రభుత్వం అనేక రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా తట్టుకుని ప్రభుత్వ విద్యుత్తు రంగాన్ని నిలబెట్టారని గుర్తుచేశారు. శనివారం నల్లగొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలన, డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి జగదీశ్రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు.
నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఫ్లైయాష్, కోల్ప్లాంట్ను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు టెండర్లు పిలవడం సరికాదని చెప్పారు. ప్లాంట్ ఆపరేషన్, మెయింటెనెన్స్ ప్రభుత్వ పరిధిలో ఉండాలనేది బీఆర్ఎస్ పాలసీ అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పార్టీలో చర్చించి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. స్థానికులతో పాటు ఉద్యోగులు, సిబ్బంది సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ నెల 17న హ్యామ్రోడ్ల పేరుతో పెద్ద సాంకు శ్రీకారం చుట్టేందుకే సీఎం రేవంత్రెడ్డి నల్లగొండకు వస్తున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్ర ఖజానాలో నయాపైసా లేదంటూనే టెండర్లు పిలవకుండా, కమీషన్ల కక్కుర్తితో హ్యారోడ్లకు శంకుస్థాపన చేయనున్నారని విమర్శించారు. సీఎం పలుమార్లు నల్లగొండ జిల్లాకు వచ్చినా ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ నల్లగొండకు పెద్ద ఎత్తున నిధులిచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ఫ్లోరిన్ తరలింపు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, నల్లగొండ, సూర్యాపేట, భువనగిరికి మెడికల్ కాలేజీలు, నల్లగొండ పట్టణ అభివృద్ధికి 1,300 కోట్లు, యాదాద్రి టెంపుల్ పునర్నిర్మాణం, పవర్ప్లాంట్ లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు స్కాంలకు కేంద్రబిందువులుగా మారారని, రైస్మిల్లర్ల వద్ద కమీషన్లు తీసుకుని రైతులను మోసంచేశారని ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన మంత్రి పదవి ఎక్కడ పోతుందోనన్న భయంతో రేవంత్ను కాకపట్టేందుకే సభ పెడుతున్నారని ఎద్దేవాచేశారు. తమ్ముడికి మం త్రి పదవి ఇచ్చి తనది పీకేస్తారన్న అపనమ్మకంతో కోతల కోమటిరెడ్డి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. సర్ ప్రక్రియపై పార్టీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.