BRS | నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి7(నమస్తే తెలంగాణ): కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించటాన్ని నిరసిస్తూ తలపెట్టిన బహిరంగ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ నెల 13న నిర్వహించనున్న సభ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసింది. నల్లగొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద నార్కట్పల్లి-అద్దంకి హైవేకి ఆనుకుని ఉన్న విశాలమైన స్థలంలో సభను నిర్వహించాలని నిర్ణయించారు. సభా స్థలాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, మా జీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, పార్టీ సమన్వయకర్త రవీందర్సింగ్, పార్టీ నేత చెరుకు సుధాకర్ బుధవారం పరిశీలించారు. సభా వే దిక, గ్యాలరీలు, బారికేడింగ్, వాహనాల పా ర్కింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. గురువారం నుంచి ఏర్పాట్లు ముమ్మరం చేయనున్నట్టు తెలిపారు. అంతకుముందు ఎస్పీ చందనాదీప్తిని కలిసి సభకు అనుమతి కోరుతూ ఓ లేఖ ను అందజేశారు. ఈ సభకు కృష్ణానదీ పరీవాహక ప్రాంత జిల్లాల నుంచి భారీ సంఖ్యలో రైతులు, ప్రజలను సమీకరించాలని ప్రయత్నా లు చేస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా ప్రజలు కూడా సభకు తరలిరావాలని జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. ఓవైపు సభా ఏర్పాట్లపై దృష్టి సారిస్తూనే మరోవైపు నియోజకవర్గాలవారీగా విస్తృత ప్రచారం కోసం సమన్వయకర్తలను పార్టీ రంగంలోకి దింపింది.
బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో విశాలమైన స్థలాన్ని ఎంపికచేశారు. నల్లగొండ నలువైపుల నుంచి సులువుగా సభాస్థలానికి చేరుకునే చర్యలు తీసుకొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ హాజరైన బహిరంగ సభను ఇక్కడే నిర్వహించారు. గురువారం నుంచి సభా స్థలం చదును చేయడంతోపాటు ఏర్పాట్లను మొదలు పెట్టనున్నట్టు జగదీశ్రెడ్డి తెలిపారు. సభ నిర్వహణ అనుమతి కోరుతూ నల్లగొండ ఎస్పీ చందనాదీప్తిని పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ బుధవారం ఎస్పీ కార్యాలయంలో కలిసి లేఖను అందజేశారు. త్వరగా అనుమతివ్వాలని కోరారు. ఎస్పీ చందనాదీప్తి స్పందిస్తూ నిబంధనల ప్రకారం వినతిని పరిశీలించి నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. నేడు సభా అనుమతిపై పోలీసులు తమ నిర్ణయం ప్రకటించవచ్చని సమాచారం.
చలో నల్లగొండ సభకు విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. సభకు కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున తరలివస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా జరిగిన తప్పును సరిదిద్దుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధం కావాలని సూచించారు. ప్రాజెక్టుల పరిరక్షణ విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేందుకు అందరూ సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఇది ప్రజల బతుకు సమస్య.. వదిలేస్తే కృష్ణా పరీవాహక ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. అందుకే కేసీఆర్ బలమైన ప్రజా ఉద్యమానికి సిద్ధమయ్యారని చెప్పారు. 13న నిర్వహించే సభకు ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.