నీలగిరి, నవంబర్ 12: ప్రతి మాటలో సీఎం కేసీఆర్పై విషం చిమ్మడం తప్ప తెలంగాణకు ప్రధాని మోదీ ఒక్క రూపాయి ఇచ్చింది లేదని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో ఓడిపోయామనే అక్కసుతోనే మోదీ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణకు ఎప్పుడు వచ్చినా కూడా ప్రధాని మోదీ ఒక్క పైసా ఇచ్చిన సందర్భం లేదని దుయ్యబట్టారు. కేంద్రం సృష్టిస్తున్న ఆటంకాలను సీఎం కేసీఆర్ అధిగమిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని నిప్పులు చెరిగారు. ఒకవైపు అభివృద్ధిని అడ్డుకొంటూ.. మరోవైపు టీఆర్ఎస్లో అలజడి రేపాలని బీజేపీ కుట్రలు చేసిందని విమర్శించారు. మొదటి నుంచీ తెలంగాణ వ్యతిరేకి అయిన మోదీ.. తెలంగాణను అడుగడుగునా అడ్డుకునే కుట్రలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు నీతి మాటలు చెప్తే నమ్మి మోసపోయేందుకు తెలంగాణ ప్రజలేమీ గుజరాతీలు కాదని పేర్కొన్నారు. దేశ ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీ బాట పడితే.. తమకు ప్రమాదం పొంచి ఉన్నదనే భయంతో తెలంగాణపై విషం కక్కుతున్నారని దుయ్యబట్టారు. మోదీ ఆటలు ఎంతో కాలం సాగవని స్పష్టం చేశారు. ప్రధాని స్థాయిని మరిచి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కాళేశ్వరం, పాలమూరు-డిండి ఎత్తిపోతల పథకాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.