హైదరాబాద్ : అధికార కాంగ్రెస్(Congress) పార్టీపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఫైర్ అయ్యారు. పూటకో తీరు మాట్లాడుతున్న ఆ పార్టీ విధానాలపై మండిపడ్డారు. అధికారంలో ఉన్నామన్న సోయి లేకుండా మాట్లాడుతున్న తీరుపై ఘాటుగా స్పందించారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశంలో మట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాటం సిగ్గుచేటన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తామని నమ్మకం లేక కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చారు. హామీల అమలును ప్రశ్నిస్తే వారికి అసహనం పెరుగుతున్నదని పేర్కొన్నారు. మా మీద కోపం ఉంటే తీర్చుకోండి. రాష్ట్రానికి నష్టం చేసే పనులు చేయొద్దని హితవు పలికారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి(Komati Reddy Venkat reddy) ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు.
నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దని కోమటి రెడ్డి చెప్పిన దాన్నే కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ నిజం చెబితే కోమటి రెడ్డి చిన్నా పెద్దా లేకుండా మాట్లాడుతున్నారు. కోమటి రెడ్డిని కాంగ్రెస్లో కోవర్టు అని ఆ పార్టీ నేతలే అంటారని గుర్తు చేశారు. కాంగ్రెస్లో ఉంటూ బీజేపీ అభ్యర్థి తన తమ్ముడికి ఓట్లేయమని చెప్పింది కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు.బీఆర్ఎస్ను 39 ముక్కలు చేస్తా అంటున్నారు. కోమటి రెడ్డి తాత తరం కూడా కాదన్నారు.
యూరియా కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు పెట్టే పాత రోజులు మళ్లీ వచ్చాయి. ముందు ఆ సమస్య పై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రైతు బంధు ఇంకా రాక పోవడంపై అన్న దాతల్లో ఆందోళన ఉంది. అప్రకటిత కరెంటు కోతలు పెరిగి పోయాయి.కృష్ణా జలాల్లో తెలంగాణ కు అన్యాయం జరుగుతుందన్నారు.
తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రజలు కాంగ్రెస్ను గెలిపిచింది పార్టీ లను చీల్చడానికి కాదని పేర్కొన్నారు. కేసీఆర్ వల్లే సాగర్లో నీళ్ల సమస్య వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి అంటున్నడు. పాలన చేత కాకుంటే తప్పుకోవాలన్నారు. తప్పుడు మాటలు మాట్లాడడానికి కోమటి రెడ్డికి కొంచమైనా సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు. నిరసనలకు మేము తొందర పడటం లేదు. ప్రజలే సమస్యల పై రోడ్ల పైకి వస్తారు. పార్లమెంటు ఎన్నికల్లో మేమే మెజారిటీ సీట్లు గెలుస్తామన్నారు.