Jagadish Reddy | నల్లగొండ : కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. జల హక్కుల కోసం రేపు కేసీఆర్ హాజరయ్యే ఛలో నల్గొండ సభ ఏర్పాట్లను జగదీశ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్రంతో కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం చేసుకుంది. అందుకే రేవంత్ అప్పనంగా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పారు. కాంగ్రెస్ అంటేనే మోసం.. నిండు సభలో అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్కు అలవాటే. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సాగర్ ప్రాజెక్టును ఆక్రమించడానికి ఏపీ వస్తే తామే తరిమేశాం అని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీఎం, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందుకు వెళ్లడం లేదు.? అక్కడ కేంద్ర బలగాలు ఎందుకు ఉన్నాయి..? అని ప్రశ్నించారు. కృష్ణా జలాల హక్కులపై బీఆర్ఎస్ పోరాటంతోనే కేఆర్ఎంబీకి అప్పగించలేదని కాంగ్రెస్ తీర్మానం చేసింది. కేసీఆర్ బయలుదేరారు అనగానే కాంగ్రెస్ వాళ్లకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు.
ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నుండి ప్రజలు, అన్నదాతలు సభకు భారీగా హాజరు కానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు జగదీష్ రెడ్డి. సభ చరిత్రలో నికిచిపోయేలా ఉంటుందన్నారు. అన్నదాతలు పార్టీలకు అతీతంగా తరలి వస్తున్నారు…ఇది రైతు గర్జన సభ అని అన్నారు. రైతులు పిడికిలి బిగిస్తే ఎంత పెద్ద పార్టీ అయినా భస్మం అవుతుందన్నారు. తమ కళ్ల ముందే నీళ్లు పోతుంటే రైతులు తట్టుకోలేక పోతున్నారని చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ సభకు వస్తున్నట్లు తెలిపారు జగదీష్ రెడ్డి.