Telangana Assembly | రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు అప్పులు తెచ్చామని.. తెచ్చిన అప్పులను సగానికిపైగా తీర్చేశామని జగదీశ్ రెడ్డి తెలిపారు. శాసన సభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని ఆయన వివరించారు.
ఆనాడు తెలంగాణ రైతాంగం పరిస్థితి దారుణంగా ఉండేదని జగదీశ్ రెడ్డి అన్నారు. బండెడ్లు అమ్మడం నుంచి రైతుల పరిస్థితి మొదలైతే.. చివరకు పుస్తెలు అమ్మకుని.. ఏ బోరు వేసిండ్రో.. ఆ భూమి అమ్ముకునే దుస్థితి ఆనాడు ఉండేదన్నారు. 10, 20 ఎకరాలు ఉన్న రైతులు కూడా.. హైదరాబాద్కు కూలీకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయన్నారు. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యకుమారీ వరకు రోడ్డు వెంబడి పార, గడ్డపార పట్టుకుని పోతుంటే.. వాళ్లను ఆపి మీది ఏ ఊరు ఉంటే.. వాళ్లది మహబూబ్నగర్, పాలమూరు అని అందరికీ తెలిసిందేనని చెప్పారు. అలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు ప్రజలకు తమకు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు.
అప్పుడు విద్యుత్ దొరికినా.. దాన్ని సరఫరా చేయడానికి అవకాశాలు లేవని అన్నారు. 2004 తర్వాత వరుసగా మూడు సంవత్సరాలు బ్రహ్మండంగా వర్షాలు కురిసి హైడల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని.. ఆ కాలంలో కూడా రైతులకు వరుసగా 6 గంటలు విద్యుత్ ఇచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఆనాడు ఉత్తర- దక్షిణ విద్యుత్ నెట్వర్క్ మధ్య అనుసంధానం లేదని గుర్తు చేశారు. 33/11 కేవీ సబ్స్టేషన్ నుంచి కరెంటు ఇవ్వాలంటే.. 3 గంటలకు మించి ఒక ఫీడర్లో ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే.. 133కేవీ, 220కేవీ, 400కేఈ అందుబాటులో లేదన్నారు.. దీంతో బ్యాక్డౌన్ చేయాల్సిన పరిస్థితి లేదన్నారు. రైతాంగానికి వరుసగా 6 గంటల కరెంటు ఇవ్వగలమా? అని ఆనాడు విద్యుత్ ఉద్యోగాలకు ఓ కల ఉండేది. కానీ ఇవాళ 24 గంటల కరెంటు ఇవ్వాలని నిర్ణయించిన మరుక్షణం ఎక్కువగా సంతోషించింది విద్యుత్ ఉద్యోగులే అని చెప్పారు.
ఆనాడు పొరపాటున విద్యుత్ ఉద్యోగులు గ్రామాలకు వెళ్తే.. వాళ్లను గ్రామపంచాయితీలో పెట్టి తాళం పెట్టని గ్రామం లేదని గుర్తు చేశారు. సబ్స్టేషన్ల ముందుకు వచ్చే రైతులు ధర్నా చేసిన పరిస్థితి ఉండేదన్నారు. ‘ ఒకప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉంటే.. ఇవాల్టి ఉపముఖ్యమంత్రి పార్టీ ధర్నాలు, రాస్తారోకో చేసింది. ఇదే అసెంబ్లీలోకి ఎండిపోయిన కంకులు, వరి, మక్క కంకులు, పత్తి చేలు తీసుకొచ్చింది. ఉపముఖ్యమంత్రి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి పార్టీ కూడా అలాగే చేసింది. ఈ సభలో ఈ ఘటనలు నిత్యకృత్యాలుగా ఉండేవి.’ అని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో విద్యుత్ రంగంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని తెలిపారు.
మన దగ్గర వెంటనే విద్యుత్ ఉత్పత్తి చేయడం కష్టంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి గ్రిడ్ అనుసంధానం చేశామన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశామని తెలిపారు. మొదట అందుబాటులో ఉన్న వ్యవస్థతో గృహ, వాణిజ్య రంగానికి 24 గంటల కరెంటు తీసుకొచ్చాం. ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి తీసుకొచ్చామన్నారు. ఒక సంవత్సరంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను అభవృద్ధి చేసి.. వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇంకా మెరుగుపరచుకుని 9 గంటల కరెంటు ఇవ్వగలిగామన్నారు. రెండు సంవత్సరాల కాలంలో రైతాంగానికి కూడా 24 గంటల విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లను రెట్టింపు నిర్మించామని తెలిపారు.
ఇవన్నీ డబ్బుల్లేకుండా..వాటంతటా అవే జరగాల్సి ఉండే అన్నట్టు మాట్లాడుతున్నారని జగదీశ్ రెడ్డి అన్నారు. అయితే అప్పు తెచ్చినం.. తెచ్చిన అప్పులో సగానికి పైగా తీర్చేశామని స్పష్టం చేశారు. ఆరోజు ఇచ్చిపోయిన 22వేల కోట్లను తీసేస్తే.. మేం తీసుకొచ్చిన అప్పుల్లో సగానికి పైగా తీర్చేశామని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లలాగే.. అప్పు అయితే ఎలా అని భయపడుతూ కూర్చుంటే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ సంస్థ పెట్టుబడులు పెట్టాలన్నా.. తెలంగాణవైపు.. హైదరాబాద్ వైపే చూస్తున్నారని అన్నారు. దీనికి కారణం మనం ఇచ్చిన 24 గంటల నిరంతరాయ విద్యుత్ ప్రధానమైన కారణమని పేర్కొన్నారు. మన నాయకత్వం, మనమీద ఉండే విశ్వసనీయతతో పాటు కరెంటు, నీళ్లే కారణమన్నారు. హైదరాబాద్ నగరం ఇంత నిమ్మలంగా ఉందంటే దానికి కారణం.. 24 గంటల విద్యుత్తో పాటు నీళ్లు అందుబాటులోకి రావడానికి ప్రధాన విషయమని అన్నారు. ఇవాళ మంచినీళ్లు రావాలన్నా.. వ్యవసాయం జరగాలన్నా విద్యుత్తే కావాలని అన్నారు. అందుకే మొట్టమొదట విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని తెలిపారు. ఇవాళ భారత దేశంలో తెలంగాణను నంబర్వన్గా నిలిపిందంటే దానికి కారణం విద్యుత్తే అని తెలిపారు.