హైదరాబాద్: రైతు రుణమాఫీలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. అందరికి రుణమాఫీ చేయలేదని మంత్రులే చెబుతున్నారన్నారు. బ్యాంకుల లెక్కప్రకారం 50 లక్షల మందికిపైగా రైతులుకు సంబంధించి రూ.49 వేల కోట్లు రుణాలున్నాయి. అయితే మంత్రులు మాత్రం రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకూ రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా 15 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మాత్రం రైతులందరికీ రుణాలు మాఫీ చేశామంటూ చేశామని డ్యాన్స్ చేస్తున్నరని విమర్శించారు. మరి ఇప్పుడు ముక్కు నేలకు రాయాల్సింది ఎవరని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. రుణమాఫీపై ఒక్కో మంత్రి ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. రుణమాఫీ కాని రైతులు ఎక్కవ ఫిర్యాదు చేయాలో స్పష్టత లేదన్నారు. తమకేం తెలియదని అధికారులు, బ్యాంకు సిబ్బంది చెబుతున్నారని వెల్లడించారు. అసలు ఎంతమందికి మాఫీ చేస్తరు.. ఇప్పటివరకు ఎంతమందికి చేశారో చెప్పాలన్నారు. మిగిలినవారికి ఏ తేదీలోగా మాఫీ చేస్తారో స్పష్టం చేయాలన్నారు.
ప్రతిపక్షంగా ఇంకా తమ పని మొదలుపెట్టలేదని జగదీశ్ రెడ్డి అన్నారు. దగాపడ్డ రైతులే స్వయంగా రోడ్డెక్కుతున్నారని తెలిపారు. ఆందోళన చేస్తున్న రైతులను కేసులతో భయపెడుతున్నారని విమర్శించారు. రూ.2 లక్షలకు మించి ఉన్న రుణం కడితేనే మాఫీ చేస్తామంటున్నరని, ప్రభుత్వం రూ.2లక్షలు మాఫీ చేస్తే మిగతావి రైతులే కట్టుకుంటరని వెల్లడించారు. ఏ తేదీలోగా మాఫీ చేస్తారో చెబితే మిగతావి రైతులు కడుతామంటున్నరని వెల్లడించారు. రైతులపై దమనకాండకు పాల్పడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. రైతులకు అండగా తమ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినతర్వాత సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం. తెలంగాణ ప్రజల అభిప్రాయం మేరకు అక్కడ విగ్రహం పెడతాం. రాజీవ్ గాంధీకి తెలంగాణతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మ లేనివాళ్లు అధికారంలో ఉన్నారని విమర్శించారు. రాజీవ్ విగ్రహం విషయంలో కోదండరామ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.