Jagadish Reddy | హైదరాబాద్ : తెలంగాణను చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చామని, అలా ఈ పదేండ్ల కాలంలో విద్యుత్ రంగంలో ఎన్నో విజయాలు సాధించామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో విద్యుత్ రంగ పరిస్థితిపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రైతులతో సహా అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల కరెంట్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారా..? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికి కూడా 200 యూనివట్ల వరకు ఉచిత విద్యుత్ ఎప్పట్నుంచి ఇస్తారు..? అనే విషయాన్ని చెప్పాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రం ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,700 మెగావాట్లపైన ఉంది. రూ. 22 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. రూ. 44 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పాను. శ్వేతపత్రంలో కూడా అదే ఉంది. కాంగ్రెస్ హయాంలో ఆ రోజు వ్యవసాయానికి 6 గంటలు కరెంట్ ఇచ్చారు. 4 నుంచి 8 గంటలు ఇతర రంగాలకు ఇస్తున్నారని చెప్పాను. పరిశ్రమలకు రెండు రోజులకు హాలిడే ఉన్న విషయాన్ని చెప్పాను. మీరు ఒప్పుకున్నారు. ఇవన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయి. నేనేం కొత్తగా ఏం చెప్పలేదు అని జగదీశ్ రెడ్డి తెలిపారు.
ఈ పదేండ్లలో పంపు సెట్ల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. కాలువల మీద మోటార్లు పెట్టడం వల్ల పంపు సెట్ల సంఖ్య పెరిగింది. చెక్ డ్యాంల వద్ద మోటార్లు పెట్టుకున్నారు. మిషన్ కాకతీయ ద్వారా 6 మీటర్ల భూగర్భజలాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పాయి. వీటి అన్నింటికి మించి వ్యవసాయ రంగం పెరిగిందనడానికి ఒక్కటే ఉదాహరణ. 2013-14 నాడు రెండు పంటలు కలిపి 40 లక్షల మెట్రిక టన్నుల ధాన్యం సేకరిస్తే, గత ఏడాది రెండు పంటలు కలిపి 2 కోట్ల 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దానికి మించి వేరే సాక్ష్యాలు అక్కర్లేదు అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.