జడ్చర్ల టౌన్, డిసెంబర్ 12 : ఓ కేసు విషయంలో జడ్చర్ల కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు జడ్చర్ల సీఐకి హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. జడ్చర్లకు చెందిన ప్రతిభ అనే మహిళ.. కౌకుంట్ల శ్యాంకుమార్, వెంకటేశ్గౌడ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరుతూ తన న్యాయవాది ద్వారా కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.
వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జడ్చర్ల కోర్టు గత జూన్ 19న సీఐకి ఆదేశాలిచ్చారు. సీఐ రమేశ్బాబు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా సెప్టెంబర్ 3న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారని ఆరోపిస్తూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సోమవారం హైకోర్టు న్యాయమూర్తి సీవీ భాస్కర్రెడ్డి విచారించి.. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన జడ్చర్ల సీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు వారాల్లోగా హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీలో రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించారు.