హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో 31న నిర్వహించాల్సిన బహిరంగ సభను బీజేపీ రద్దు చేసుకోబోతున్నట్టు సమాచారం. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్, అభ్యర్థి రాజగోపాల్రెడ్డి సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బెడిసికొట్టడం, జాతీయస్థాయిలో పార్టీ పరువు పోవడంతో సభను రద్దు చేసుకున్నట్టు తెలుస్తున్నది.‘ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారం లో బీజేపీ జాతీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టు ఆడియో టేపులు బయటికి రావడంతో సభ రద్దుకు నిర్ణయించినట్టు తెలిసింది.
నంబర్ 2 వద్దన్నాడని నడ్డా సభ రద్దు?
మునుగోడులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ‘హండ్రెడ్ రూపీస్, నంబర్ 2 (అమిత్షా), నంబర్ 1(మోదీ)’ అనే కోడ్భాష పాపులర్ అయింది. ‘క్యాషా’య స్వాములు కోడింగ్.. డీకోడ్ చేసిన భాషను మునుగోడు మాట్లాడుతున్నది. జేపీ నడ్డా సభకు వచ్చే అవకాశాలు లేవని శుక్రవారం రాజగోపాల్ క్యాంపు కార్యాలయానికి సమాచారం రావడంతో సభ రద్దు అయినట్టేనని తెలుస్తున్నది. ‘నంబర్ 2 వద్దాన్నాడని.. నడ్డా వత్తలేడట’ అని యువత సెటైర్లు వేస్తున్నది.