గద్వాల/అయిజ/ఊట్కూరు/శ్రీశైలం/మహదేవపూర్, ఆగస్టు 4 : కృష్ణా, భీమా నదులకు వరద పోటెత్తుతున్నది. కర్ణాటకలోని అల్మట్టి డ్యామ్ నుంచి 1.5 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ డ్యామ్ నుంచి 1,45,376 క్యూసెక్కులు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టుకు మంగళవారం 2.41 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. 33 గేట్లు ఎత్తి దిగువకు 2,53,102 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తికి 26,817 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తం అవుట్ఫ్లో 2,53,102 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యామ్ పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.701 టీఎంసీలు నిల్వ ఉన్నది. భీమా నదిలో వరద క్రమంగా పెరుగుతున్నది. కర్ణాటకలోని యాద్గీర్ జిల్లా భీమాపై ఉన్న గూగుల్ బరాజ్ 35 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా నది ఉరకలేస్తుండటంతో బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్కు 1,02,698 క్యూసెక్కుల వరద ఉండగా.. అవుట్ఫ్లో 1,556 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 54.420 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు డ్యామ్ సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకున్నది. 1,91,076 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా.. డ్యామ్లో ప్రస్తుతం 108 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు.
మేడిగడ్డకు 1,82,337 క్యూసెక్కుల వరద
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు మంగళవారం 1,82,337 క్యూసెక్కుల వరద వచ్చింది. మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ గరిష్ఠ నీటి ప్రవాహ ఎత్తు 100 మీటర్లు కాగా, ప్రస్తుతం 91.50 మీటర్ల ఎత్తులో ఉన్నదని భారీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.