హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రోజూ గంటల తరబడి గొడ్డుచాకిరీ చేస్తున్న తమపై పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం కనికరం చూపడం లేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల విధులకు హాజరైన తమకు డైలీ డ్యూటీ అలవెన్సులు, డైట్ చార్జీలు కట్చేసి కడుపు కొట్టొద్దని వేడుకుంటున్నారు. ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డులకు వేతనంతో కలిపి డైలీ డ్యూటీ అలవెన్సును ప్రోత్సాహకంగా ఇస్తున్నారని, తెలంగాణలో మాత్రం డైలీ డ్యూటీ అలవెన్సును కట్ చేస్తున్నారని వాపోతున్నారు. ఇటీవల తమిళనాడులో తొలిదశ పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ నుంచి 2 వేల మంది హోంగార్డులను పంపారు. దీంతో వారు ప్రయాణంతో కలిపి ఏడురోజులు విధులు నిర్వర్తించారు. కానీ, ఈసారి డైలీ డ్యూటీ అలవెన్సును కట్ చేయబోమని చెప్పిన ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
‘తమిళనాడులో ఎన్నికల విధులు నిర్వర్తించిన తెలంగాణ హోంగార్డుల డైలీ డ్యూటీ అలవెన్సును అక్కడి ప్రభుత్వం జమ చేసినందున దానికి సంబంధించి ఇక్కడ మీకు బిల్లు డ్రా చేయం’ అని స్పష్టం చేశారు. ఏడు రోజుల్లో ప్రయాణానికి అయిన రెండ్రోజులను మినహాయించి కేవలం ఐదు రోజుల డైట్ చార్జీలే ఇస్తామంటూ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై హోంగార్డులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు అవసరమైతే ఓ రూపాయి అదనంగా ఇచ్చి సంతోషంగా పంపాల్సింది పోయి ఇవ్వాల్సిన డబ్బులను కూడా కట్ చేయడం దుర్మార్గమని వాపోతున్నారు. ఇతర రాష్ర్టాల్లో ఇచ్చినట్లుగా డైలీ డ్యూటీ అలవెన్సును వేతనంతో కలిపి ప్రోత్సాహకంగా ఇవ్వాలని, ప్రయాణ రోజులకు కూడా డైట్ చార్జీలు ఇవ్వాలని కోరుతున్నారు.అవిశ్రాంతంగా పనిచేసిన తమపై కనికరం చూపాలని డీజీపీ రవిగుప్తాను, సీఎం రేవంత్రెడ్డిని వేడుకుంటున్నారు.