ఆదిలాబాద్, సెప్టెంబరు 26 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాకు ఐటీపార్క్ రాబోతున్నది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న ఐటీపార్క్కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. దీంతో జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చెప్పారు. సోమవారం ఆయన ఆదిలాబాద్ పట్టణంలోని బీడీఎన్టీ ల్యాబ్స్ ఐటీ కంపెనీని సందర్శించారు. ఐటీ కంపెనీలో 120 మందికి ఉపాధి కల్పించిన ఎన్టీటీ, బీడీఎన్టీ నిర్వాహకుడు సంజయ్ దేశ్పాండేను అభినందించారు. గతంలో ఆదిలాబాద్ అభివృద్ధికి దూరంగా ఉండేదని, ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఐటీ మ్యాప్లో చేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రూరల్ టెక్నాలజీ పాలసీతో ద్వితీయశ్రేణి పట్టణాలకూ ఐటీ రంగం విస్తరించిందని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు దీటుగా ద్వితీయశ్రేణి నగరాల్లో నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూరల్ టెక్నాలజీ పాలసీని తెచ్చినట్టు వివరించారు. అమెరికా, ఇతర అంతర్జాతీయ సంస్థలతో ఆదిలాబాద్ ఐటీ కంపెనీ యువత పనిచేయడం సంతోషకరమని అన్నారు. బీడీఎన్టీ కంపెనీకి విద్యుత్తు సరఫరా, భవనం ఆధునికీకరణకు రూ.1.50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మూడు నెలల్లో కంపెనీకి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
సీసీఐపై కేంద్రం వివిక్ష
మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునఃప్రారంభించడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీసీఐని తిరిగి తెరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని వివరించారు. కొత్త కంపెనీ కింద ప్రోత్సాహకాలను ఇస్తామని ప్రకటించినా ఫలితం లేదని పేర్కొన్నారు. నిర్మాణ రంగంలో సిమెంట్ అవసరం పెరిగిన నేపథ్యంలో ఆదిలాబాద్ పరిశ్రమను తెరిపిస్తే అద్భుతమైన ప్రగతి ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సీసీఐని ప్రారంభించాలని ఎమ్మెల్యే జోగు రామన్న నాయకత్వంలో స్థానిక నాయకులు జేఏసీగా ఏర్పడి, చాలా ప్రయత్నాలు చేసినా కేంద్రం స్పందించలేదని మండిపడ్డారు.
తెలంగాణ కశ్మీరం ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా తెలంగాణకు కశ్మీరమని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. అడవులు, జలపాతాలు, గుట్టలు, వాగులు, వంకలు, సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, కడెం, జోడేఘాట్ లాంటి పర్యాటక ప్రాంతాలు ఉన్న ఆదిలాబాద్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తారని అన్నారు. ఈ విషయంపై దృష్టి సారించాలని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ తొలుత జైనథ్ మండల కేంద్రానికి హెలికాప్టర్లో చేరుకున్నారు. అక్కడి నుంచి మండలంలోని దీపాయిగూడకు రోడ్డు మార్గంలో వెళ్లి ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే తల్లి జోగు భోజమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడ రిమ్స్ ఎదుట ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దండె విఠల్, ఎమ్మెల్యే లు రాథోడ్ బాపురావ్, ఆత్రం సక్కు, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.