సిద్దిపేట, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరిస్తూ యువత స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు చేసుకొనే భాగ్యాన్ని కల్పిస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. నిన్నటి వరకు విద్యాకేంద్రంగా ఉన్న సిద్దిపేట.. నేడు ఉద్యోగాల హబ్గా మారనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని పోలీసు కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం 15 ప్రముఖ ఐటీ కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో సిద్దిపేటకు ఐటీ టవర్ రావడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి పట్టణాల్లో ఐటీ టవర్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. రూ.63 కోట్లతో సిద్దిపేటలో 718 సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఐటీ టవర్లో ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఈ నెల 15న ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దీనిని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. తొలుత 718 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. రెండు షిఫ్టులకు కలిపి 1,436 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని వెల్లడించారు. ఈ మెగా జాబ్మేళాలో ఉద్యోగాలు పొందిన ఉద్యోగార్థులకు టాస్ ద్వారా శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. ప్రతి బ్యాచ్లో 150 మందికి 45 రోజులపాటు టాస్ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.