మహబూబాబాద్ : గిరిజనుల సమస్యలపై అవగాహన లేని వారు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండడం ఈ దేశ గిరిజనుల దురదృష్టమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన మహబూబాబాద్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడారు.
2015 నుంచి తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం పని చేస్తూ.. 2017లో శాసనసభలో తీర్మానం చేసి బిల్లును కేంద్రానికి పంపించాం. దానిపై నిరంతరం అడుగుతుంటే పార్లమెంటు సాక్షిగా బిల్లు పంపలేదని పచ్చి అబద్ధాలు చెబు తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. గిరిజనులను పట్టించుకోని కేంద్రమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో నాడు రాష్ట్రం అంతటా తిరిగిన ఉద్యమ సారథి కేసిఆర్ రానున్న తెలంగాణలో 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు.
గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై 2015 మార్చి 3వ తేదీన జీఓ ఎం. ఎస్ నెంబర్ 5 పేరుతో రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ చెల్లప్ప నేతృత్వంలో ఒక కమిషన్ వేశారు. ఈ కమిషన్ గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతం పెంచడానికి ప్రతిపాదిస్తూ 2016 డిసెంబర్ 8వ తేదీన తన నివేదికను సమర్పించిందన్నారు. డాక్టర్ చెల్లప్ప కమిషన్ చేసిన ప్రతిపాదనలు ఆమోదిస్తూ 2017 ఏప్రిల్ 15వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ క్యాబినెట్ తీర్మానం చేసింది.
వెంటనే అసెంబ్లీ 7వ సెషన్ లో 2017 ఏప్రిల్ 16వ తేదీన ఈ బిల్లును తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. వెంటనే 2017 మే 29వ తేదీన ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోరుతూ కేంద్ర హోమ్ వ్యవహారాల శాఖకు పంపించామన్నారు. ఇలా ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు పంపామన్నారు. గిరిజన వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. అప్పటి వరకు నిత్యం ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేసి, కేంద్రం మెడలు వంచి మన డిమాండ్లను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.