హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో నానాటికీ పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రజలను నిరంతరం అప్రమత్తంగా ఉంచేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్సీఎస్బీ) ఏర్పాటైంది. 2025 నాటికి సైబర్ నేరాల విలువ 10.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో బంజారాహిల్స్లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రెటేడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐసీసీసీ)లో టీఎస్సీఎస్బీని ఏర్పాటు చేసి, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సైబర్ సెక్యూరిటీని కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిషించే ఈ బ్యూరో.. రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని సైబర్ ఠాణాలతోపాటు, జిల్లాల్లోని సైబర్ కో-ఆర్డినేషన్ సెంటర్లతో అనుసంధానమై ఉంటుంది.
1930 టోల్ఫ్రీ నంబర్తో కాల్సెంటర్
ప్రస్తుతం 1930 టోల్ఫ్రీ నంబర్తో టీఎస్సీఎస్బీ ఓ కాల్సెంటర్ను నడుపుతున్నది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా రోజూ సైబర్ నేరాల బాధితుల నుంచి దాదాపు 750 కాల్స్ వస్తున్నాయి. అందులో దాదాపు 500 కాల్స్ గతంలో ఇచ్చిన ఫిర్యాదులు ఇచ్చిన బాధితుల నుంచి, మరో 250 వరకు కాల్స్ కొత్త బాధితుల నుంచి అందుతున్నాయి. వారి ఫిర్యాదులను పరిష్కరించేందుకు డాటా అగ్రిగేషన్ అండ్ ఎనాలసిస్ యూనిట్(డీఏఏయూ), సెంట్రర్ మానిటరింగ్ యూనిట్ (సీఎంయూ), త్రెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (టీఐయూ), ప్రోయాక్టివ్, ఇన్వెస్టిగేషన్ సపోర్ట యూనిట్ (ఐఎస్యూ), పబ్లిక్ అవేర్నేస్ అండ్ ఎంగేజ్మెంట్ యూనిట్లు నిరంతరం పనిచేస్తున్నాయి.
సైబర్ సెక్యూరిటీ వింగ్
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలను నిరంతరం గమనిస్తూ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ వింగ్ పనిచేస్తున్నది. వివిధ రకాల సైబర్ నేరాలను, మాల్వేర్స్తో జరుగుతున్న దాడులను ఈ వింగ్ ఎప్పటికప్పుడు విశ్లేషించి హెచ్చరికలు జారీచేస్తుంది.
తెలంగాణ పోలీసులకు జేసీసీటీ నాయకత్వ బాధ్యతలు
ఆన్లైన్ నేరాలను అరికట్టేందుకు 6 రాష్ర్టాల పోలీసులతో ఏర్పాటైన జాయింట్ సైబర్ కో-ర్డినేషన్ సెంటర్ (జేసీసీటీ) నాయకత్వ బాధ్యతలను కేంద్ర హోంశాఖ తెలంగాణ పోలీసులకు అప్పగించింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, గోవాలో జేసీసీటీ ఏర్పాటైంది. ఈ రాష్ర్టాలకు కావాల్సిన సైబర్ మెళకువలను కూడా మన పోలీసులు అందిస్తారు.
సైబర్ నేరాల దర్యాప్తునకు సాఫ్ట్వేర్
సైబర్ నేరాల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా క్రైమ్ ఓఎస్ అనే సాప్ట్వేర్ను తయారు చేశాం. దీని ద్వారా కేసు దర్యాప్తు వేగంగా జరుగుతుంది, గతంలో ఒక కేసు దర్యాప్తునకు 2 వేల గంటలు పడితే.. క్రైమ్ ఓఎస్ సాప్ట్వేర్తో 250 గంటలు మాత్రమే పడుతుంది. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా చూడటంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సైబర్ ముప్పును అడ్డుకోవడం టీఎస్సీఎస్బీ ప్రధాన లక్ష్యం. సైబర్ నేరాలను అడ్డుకునేందుకు చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరమున్నది. దీనిపై నల్సార్ యూనివర్శీటీతో సంప్రదింపులు జరుపుతున్నాం.
– స్టీఫెన్ రవీంద్ర, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్