హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): . రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తూ పార్లమెంటులోనే కేంద్రం ప్రకటించినా, అదే ప్రభుత్వంలో కీలకశాఖ నిర్వహిస్తున్న నిర్మల మాత్రం పదేపదే అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైతు ఆత్మహత్యలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఇటీవల వెల్లడించిన నిజాలను జీర్ణించుకోలేక, మసిపూసి మారేడు కాయ చేసేందుకు శనివారం ఆమె విఫలయత్నం చేయడాన్ని తెలంగాణవాదులు, రైతులు సామాజిక మాధ్యమాల్లో ఎండగట్టారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో రాష్ట్రంలో 1,358 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, 2020లో అవి 466కి తగ్గాయి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి స్వయంగా చెప్పిన లెక్క ఇది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికలో సైతం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్రం తెలిపింది. ఎన్సీబీ నివేదిక ప్రకారం 2021లో రాష్ట్రంలో 359 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో 303 మంది సొంత భూములు గల రైతులు, మిగిలినవారు కౌలు రైతులు, రైతు కూలీలు ఉన్నారు. దుక్కి దున్నటం మొదలు పంట మార్కెట్కు తరలించే వరకు రాష్ట్రప్రభుత్వం రైతన్నకు నిత్యం అండగా ఉండి నడిపిస్తుండటంతో తెలంగాణలో రైతుల జీవితాలు వికసిస్తున్నాయన్నది నిజం. ఇదే సమయంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. యూపీలాంటి రాష్ర్టాల్లో పట్టపగలే అధికార పార్టీ నేతలు కార్లతో తొక్కించి చంపినా అడిగే దిక్కులేకుండా పోయింది.