నిజామాబాద్ : వ్యవసాయ రంగంలో ప్రపంచంలో అత్యుత్తమ పథకం రైతుబంధు అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన అత్యుత్తమ వ్యవసాయ ప్రోత్సాహక పథకాలలో రైతుబంధును చేర్చారనే విషయాన్ని గుర్తు చేశారు.
బాన్సువాడ నియోజకవర్గంలో రైతుబంధు ఉత్సవాల నిర్వాహణ, అభివృద్ధి పనులపై నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులతో మంగళవారం హైదరాబాద్లోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎనిమిది విడతలలో మొత్తం 50,000 కోట్ల రూపాయలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేసిందన్నారు.
పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేయకుండా సొంత పెట్టుబడితో సేద్యం చేయడం కోసం ఈ రైతుబంధు సహాయం ఉపయోగపడుతుందని తెలిపారు. రైతుబంధు వారోత్సవాలను వైభవంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గా పిలుపు ఇచ్చారు. ఇంత గొప్ప పథకం గురించి ప్రజలకు అందరికి తెలియజెప్పడానికే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రతి గ్రామంలో ఉత్సవాల కార్యక్రమాలను నిర్వహించాలి. రైతుబంధు పథకం ద్వారా గ్రామంలోని ఎంత మంది రైతులు ఎంత మొత్తంలో నగదు సహాయాన్ని పొందుతున్నారో వివరాలను ప్రతి గ్రామంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని స్పీకర్ సూచించారు. జనవరి 10న చివరి రోజు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో గ్రామాలలో ర్యాలీ నిర్వహించాలి.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు తగు జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అదేవిధంగా స్పెషల్ డెవలప్ మెంట్ పథకంలో భాగంగా మంజూరు చేసిన పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అంగన్వాడీ నూతన భవనాల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.