హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం. 50శాతం సీట్లలో అసలు గెలుపు ఊసే లేదు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశల పొంగుపై నీళ్లు చల్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు కష్టమేనంటూ ఆ పార్టీ వాస్తవ పరిస్థితిపై కుండబద్దలు కొట్టారు. 50 శాతానికిపైగా సీట్లలో కాంగ్రెస్ గెలిచే ఊసే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి ఆశల పల్లకిలో ఊరేగడం మానేయాలని చురకలంటించారు. ‘దిస్ ఈజ్ నాట్ కర్ణాటక. దిస్ ఈజ్ తెలంగాణ. ఇక్కడ కాంగ్రెస్కు ప్రత్యర్థిగా ఉన్నది స్కాముల బీజేపీ కాదు.. స్కీముల బీఆర్ఎస్.
సో.. విక్టరీ ఈజ్ నాట్ ఈజీ. ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు’ అని హెచ్చరించారు. కర్ణాటకలో బీజేపీకి ఓ నాయకుడంటూ లేడని, ఆ పార్టీ మొత్తం నరేంద్రమోదీపై ఆధారపడటం వల్లనే కాంగ్రెస్కు విజయం దక్కిందని చెప్తూ.. తెలంగాణలో బీఆర్ఎస్కు సీఎం కేసీఆర్ రూపంలో బలీయమైన నాయకత్వం ఉన్నదని, ఆ పార్టీని ఎదుర్కొనడం ఆషామాషీ వ్యవహారం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహాలపై ఆదివారం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సునీల్ కనుగోలు ఈ హెచ్చరికలు చేయడంతోపాటు పలు కీలక అంశాలను ప్రస్తావించినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 20 సీట్లలోనైనా గెలవడం గగనమేనని, ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి తదితర పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని 40కిపైగా సెగ్మెంట్లలో బీఆర్ఎస్కు కనీస పోటీ ఇచ్చే స్థితిలో కూడా కాంగ్రెస్ లేదని తేల్చిచెప్పినట్లు తెలిసింది.
ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి సునీల్ పరోక్షంగా చురకలు అంటించారు. రాష్ట్ర నాయకుల్లో కొందరు తామే సుప్రీం అన్నట్టుగా వ్యవహరిస్తూ కీలక అంశాలపై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది పార్టీకి ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరించారు. దీంతో సమావేశంలోని చాలా మంది నేతలు రేవంత్ వైపు చూడటంతో సునీల్ హెచ్చరించింది రేవంత్నేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే సీతక్క (ములుగు ఎమ్మెల్యే) కూడా సీఎం కావచ్చని, వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని రేవంత్ ఇటీవల అమెరికా పర్యటనలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక అంశాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏకపక్షంగా వ్యవహరించడాన్ని మానుకుని ఏ నిర్ణయాన్నైనా కాంగ్రెస్లోని కీలక నేతలందరితో చర్చించాకే ప్రకటించాలని సునీల్ కనుగోలు హెచ్చరించినట్టు సమాచారం.