Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జొన్న పంట దిగుబడిలో సగమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్క్ఫెడ్ను నోడల్ ఏజెన్సీగా నిర్ణయిస్తూ జొన్న కొనుగోలుపై గురువారం వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి రూ.327 కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు 46 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్ఫెడ్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 2.07 లక్షల ఎకరాల విస్తీర్ణంలో జొన్న సాగవగా, 1.83 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.3,180 కాగా, మారెట్లో మాత్రం వ్యాపారులు రూ.2,400కే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 91,865 టన్నుల కొనుగోలుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగతా పంటను నష్టానికే అమ్ముకోవాల్సి వస్తుందని రైతుల్లో ఆందోళన నెలకొన్నది. మొత్తం పంటను మద్దతు ధరకు ప్రభుత్వమే కోనుగోలు చేయాలనే వారు కోరుతున్నారు. అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్న గత ఎన్నికల హామీని నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీని రైతులు డిమాండ్ చేస్తున్నారు.