దేవరుప్పుల, జూన్ 14: ‘ఎన్నికలు ఎప్పుడొస్తాయని ప్రజలు ఎదురు చూస్తుం డ్రు.. రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని బొందపెట్టేందుకు మోకా కోసం చూస్తుండ్రు’ అని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండలోని వినాయక కన్వెన్షన్ హాలులో ఆదివారం పాలకుర్తి నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదుపై శిక్షణ, ఎస్ఐఆర్పై పార్టీ శ్రేణులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే పల్లా, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. మోసకారి హామీలతో ఏదో చేస్తామని ప్రజలను నమ్మించి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో చేసిందేమీ లేదని, హామీలను విస్మరించారని మండిపడ్డారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి చేసిన అభివృద్ధి తప్పితే జరిగిందేమీ లేదని పేర్కొనారు.
తెలంగాణలో దుర్మార్గపు పాలన కొనసాగుతున్నదని, అన్ని వర్గాల వారు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ గెలువడం, కేసీఆర్ సీఎం కావడం ఖాయమని స్పష్టంచేశారు. సభలో పార్టీ శ్రేణులకు సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై దిశానిర్దేశం చేశారు. ఇక పాలకుర్తిలో తన గెలుపు నల్లేరుపై నడకేనని, అనేక సర్వేలు బీఆర్ఎస్ పక్షాన భారీ మెజారిటీని చూపుతున్నాయని ధీమా వ్యక్తంచేశారు.
ఇక సభ్యత్వ నమోదు పకడ్బందీగా జరుగాలని సూచించారు. కాంగ్రెస్ వైఫల్యాలు ఎత్తి చూపాలని, బీఆర్ఎస్ సాధించిన విజయాలను వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అందరినీ కలుపుకొని పోవాలని కోరారు. గత ఎన్నికల్లో తాను ఓడినా ప్రజాక్షేత్రంలో ఉంటున్నానని, రైతుల కష్టాల్లో పాలుపంచుకుంటూ ఆదుకుంటున్నానని తెలిపారు.
జాతీయోద్యమంలో వందేమాతరం నినాదం, తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ నినాదాలు ఉద్యమానికి ఊపిరిపోయగా అనేక మంది తొలి, మలి దశ ఉద్యమాల్లో అగ్నికి ఆహుతయ్యారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలిపారు. వారి త్యాగాల స్మరణకు అమరుల స్తూపాలు వెలిస్తే వాటిని తాకేందుకు, మొక్కేందుకు ఇష్టపడని వాజమ్మ పాలన, దద్దమ్మ పాలన నేడు కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు. హిట్లర్ ఆదర్శమన్న మూర్ఖుడు, అవివేక సీఎం రేవంత్రెడ్డి అని విమర్శించారు. రైతాంగ పోరాట స్ఫూర్తిగా మరో మహోద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. పక్క రాష్ర్టానికి సద్దులు మోసే బద్మాష్ పాలన, ఢిల్లీకి మూటలు మోసి గల్లీ జనం కడుపులు కొడుతున్న పాలన మనం చూడాల్సివస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అనతికాలంలోనే తెలంగాణను కేసీఆర్ అగ్రభాగాన నిలుపగా నేడు పాపపు చేయి పడి తారుమారైందని అన్నారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి పాలన రియల్ ఎస్టేట్ బ్రోకర్లా ఉన్నదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దుయ్యబట్టారు. అమలు కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చాడని ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి, హనుమకొండ జడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ ఎం సుధీర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.