వరంగల్ : కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి శివాలయం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణలో రైతుల ధాన్యం ఆరబెట్టేందుకు నిర్మించుకుంటున్న కల్లాలను ఆపాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం, కేంద్ర మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందుతూ దేశంలో ఉత్తమంగా నిలుస్తున్నాయని అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో సముద్రం ఒడ్డున చేపలు ఎండబెట్టుకోవడానికి కాంట్రాక్టర్ల కల్లాలకు అనుమతి ఇస్తూ తెలంగాణ రైతులు ధాన్యం కల్లాలు నిర్మించుకుంటే అనుమతి ఇవ్వకుండా డబ్బులు వాపస్ ఇవ్వాలని అనడం బీజేపీ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఆరోపించారు. కేంద్రం నుంచి దాదాపు రెండువేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావలసి ఉండగా ఆపడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక తెలంగాణ గ్రామ పంచాయతీ సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రమంత్రి తన ప్రచారం కోసం అసత్యాలను మానుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే, అధికారులను సన్మానించిన మంత్రి
స్వచ్ఛ సర్వేక్షణ్లో వర్ధన్నపేట నియోజకవర్గం జాతీయస్థాయిలో రెండవ స్థానం, రాష్ట్రంలో మొదటి స్థానంలో పట్టణ విభాగంలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు రావడం పట్ల ఎమ్మెల్యే అరూరి రమేశ్, అధికారులు, సిబ్బందిని మంత్రి దయాకర్ రావు శాలువా కప్పి సన్మానించారు.