హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగా ణ): తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు పదేపదే కేంద్రం చేస్తున్న ప్రకటనలు ఒట్టి బూటకమని తేలిపోయింది. గడచిన 9 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1.25 లక్షల కోట్లు మంజూరు చేయగా, అందులో కనీసం ఆరవ వంతు కూడా ఖర్చు చేయలేదు. అంతేకాదు, కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకొన్న చందం గా రూ.20 వేల కోట్లు ఖర్చుచేసి, టోల్ట్యాక్స్ రూపంలో రూ.9 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసింది. మొత్తమ్మీద తొమ్మిదేండ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం ఖర్చుచేసింది రూ.11వేల కోట్లు మాత్రమే. మరోవైపు, రోడ్ సెస్సు పేరుతో పెట్రోలు, డీజిల్పై ప్రతి లీటర్కు సుమారు రూ.30 చొప్పున రాష్ట్రం నుంచి కేంద్రం వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నది.
దేశ అవసరాలు, ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ర్టాల్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. రోడ్లు వేయటానికి అయ్యే ఖర్చును వాహనదారులనుంచే టోల్ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,983 కిలోమీటర్ల మేర 30 జాతీయ రహదారులు ఉన్నాయి. ఇందులో 2,682 కిలోమీటర్లు కేంద్రం పరిధిలో, 2,301కిలోమీటర్లు రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. అవసరాలకు అనుగుణంగా కొత్త జాతీయ రహదారులను గుర్తించి వాటిని కేంద్రమే అభివృద్ధి చేయాలి. ఈ నేపథ్యంలో గడచిన తొమ్మిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రూ.1.25 లక్షల కోట్లు మంజూరు చేసింది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు ఆర్అండ్బీ శాఖ ఇప్పటికే కేంద్రానికి పంపింది. టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి పనులు చేపట్టాల్సిన కేంద్రం, వాటిని కాగితాలకే పరిమితం చేసింది. ఇప్పటి వరకు ఖర్చుచేసింది రూ.20 వేల కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంతేకాదు, మరో 14 ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఇంతవరకూ ఉలుకూ పలుకూ లేదు.
ఓ వైపు రహదారుల అభివృద్ధికి మంజూరు చేసిన నిధుల్లో ఆరోవంతు కూడా విడుదల చేయని కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రోడ్ సెస్సు పేరుతో రాష్ట్రం నుంచి వేల కోట్ల రూపాయలు పిండుకొంటున్నది. పెట్రోలు, డీజిల్ ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచి ఒక్కో లీటర్పై రూ. 20 నుంచి 30 వరకు వివిధ రకాల సెస్సుల రూపంలో వసూలు చేస్తున్నది. 2021-22లో రోడ్ సెస్సు ద్వారా వివిధ రాష్ర్టాల నుంచి కేంద్రానికి రూ.4 లక్షల కోట్లకుపైచిలుకు ఆదాయం వచ్చింది. ఇందు లో తెలంగాణ వాటా వేల కోట్ల రూపాయలు ఉన్నది. రోడ్ సెస్తోపాటు టోల్ట్యాక్స్ల రూపంలో తెలంగాణ నుంచి వేల కోట్లు వసూలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వం, రోడ్ల అభివృద్ధికి నామమాత్రంగా ఇచ్చి చేతులు దులుపుకొంటున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.