Minister KTR | హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఐటీ రంగం సృష్టించిన ఉద్యోగాల్లో 44% వాటాతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ ఎగుమతులు, ఎస్సార్డీపీపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. 2014 నాటికి ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు కాగా.. 2014 నుంచి 2023 నాటికి రూ.2,41,275 కోట్లకు ఎగబాకినట్ట్టు వెల్లడించారు.
2023 నాటికి ఐటీ ఎగుమతులు 31.44 శాతం పెరిగాయని, ఇది దేశంలోనే అత్యధిక వార్షిక పెరుగుదల అని చెప్పారు. ప్రపంచం మొత్తానికే తెలంగాణ ఐటీ గమ్యస్థానంగా మారిందని ఆపిల్, అమెజాన్, గూగుల్, సేల్స్ఫోర్స్, ఊబర్, స్టేస్ట్రీట్స్, మైక్రాన్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, ఇంటెల్, ప్రావిడెన్స్, ఎంఫొసిస్, డీబీఎస్ వంటి ఎన్నో ప్రముఖ సంస్థలు తెలంగాణకు వచ్చాయని వివరించారు. ఫేస్బుక్, క్వాల్కమ్, యాక్సెంచర్, వెల్కార్గో, జైలింగ్స్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టీసీఎస్, ఐబీఎం, టెక్మహీంద్ర, కాగ్నిజెంట్, విప్రో వంటి కంపెనీలు గణనీయంగా విస్తృతమయ్యాయని తెలిపారు. పాతబస్తీని ఐటీబస్తీగా మార్చే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మలక్పేటలో సైతం ఐటీ టవర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. ద్వితీయశ్రేణి పట్టణాలకు కూడా ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. నాడు బీఆర్ఎస్ మంత్రిగా ఈటల రాజేందరన్న ఉన్నప్పుడు.. నేనూ అన్న హుజూరాబాద్కు వెళ్లి అక్కడొక ఐటీ కంపెనీ ప్రారంభించామని, ఆయన బీజేపీలోకి పోగానే అది బంద్ అయిందని వెల్లడించారు.
6 లక్షల ఐటీ ఉద్యోగాల సృష్టి
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3,23,396 మందికి ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగాలు ఉండగా, తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్తగా ఆరు లక్షలకుపైగా ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగాలు సృష్టించినట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నిలదొక్కుకోవడంతో ఎకరం రూ.వంద కోట్లు పలికే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. తెలంగాణలో స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షీప్ ఉన్నందునే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. హర్యానాలోని గొప్ప ఐటీ సెంటర్ గుర్గావ్ను కులమతాల పేరుతో గబ్బురేపుతున్నారని, మణిపూర్లో మతాల మంటలు చల్లారలేదని, దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు ఉండటం వల్లే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నదని పేర్కొన్నారు. దేశంలో ఐటీ పురోగతి కంటే రాష్ట్రంలో ఐటీ పురోగతి నాలుగు రెట్లు అధికంగా ఉన్నదని, దానికి ఏబుల్ లీడర్షిప్ ప్రధాన కారణమని వివరించారు.
కొత్త ఉద్యోగాల కల్పనలో తెలంగాణ టాప్
కేంద్ర ప్రభుత్వ సంస్థ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ స్పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ), నాస్కామ్ నివేదిక ఆధారంగా 2021-22 ఏడాదికి టెక్నాలజీ రంగంలో దేశంలో 4.50 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తే.. అందులో 33% వాటాతో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని చెప్పారు. ఈ ఏడాది 44% పెరిగిందని తెలిపారు. హైదరాబాద్కు 1987లో తొలిసారిగా ఇంటర్గ్రాఫ్ అనే ఐటీ బిల్డింగ్ వచ్చిందని, నాటి నుంచి 2014 వరకు 27 ఏండ్లలో ఐటీ ఎగుమతుల పరిమాణం రూ.56 వేల కోట్లు కాగా.. 2022లో ఒక్క ఏడాదిలోనే తెలంగాణ నుంచి రూ.57,707 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయని వివరించారు. ఇది తమ సమర్థ పాలనకు నిదర్శనమని స్పష్టంచేశారు. బెల్లంపల్లి, కోరుట్ల, హుజూరాబాద్, పరకాల వంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఐటీ కంపెనీలు వచ్చాయని తెలిపారు. రామగుండంలో కొత్తగా ఐటీ టవర్ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నదని వెల్లడించారు. సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీనంగర్లో ఐటీ హబ్లు ఏర్పాటు చేశామని, నల్లగొండలో త్వరలోనే ఐటీ టవర్ను ప్రారంభిస్తామని చెప్పారు. సైబర్ క్రైమ్స్ను అరికట్టేందుకు దేశంలోనే తొలిసారిగా కొత్త చట్టం తెస్తున్నామని, దానిని నల్సార్ యూనివర్సిటీ రూపొందిస్తున్నదని వెల్లడించారు.
రూ.వంద కోట్ల మంజూరుకు ఆదేశం
రూ.40 కోట్లతో చార్మినార్ పాదచారుల రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు (సీపీపీ)ను త్వరలోనే పూర్తి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సీపీపీ ప్రాజెక్ట్కు అనుబంధంగా సాలార్జంగ్ మ్యూ జియం ఎదురుగా పాదచారులకు వంతెన, కులీకుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాంప్లెక్స్ వద్ద బహుళ అంతస్థుల్లో కార్ పార్కింగ్ కోసం రూ.100 కోట్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పా రు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించి శనివారం నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
7 వేల కోట్లతో 35 ప్రాజెక్టులు పూర్తి
ఎస్సార్డీపీ పథకం కింద హైదరాబాద్లో రూ.7 వేల కోట్లతో 35 ప్రాజెక్టులు పూర్తి చేశామని కేటీఆర్ వెల్లడించారు. ఎస్సార్డీపీ మొదటి దశ విజయవంతమైందని, త్వరలో రెండో దశ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ పాలన సమర్థతకు తాము పూర్తిచేసిన 35 ప్రాజెక్టులు నిదర్శనమని తెలిపారు. మోదీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అంబర్పేట, ఉప్పల్ ఫ్లైఓవర్లు అని ఎద్దేవా చేశారు.
30 నిమిషాలు కూర్చోలేరు.. 30 రోజులు సభ పెట్టాలా?;బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై కేటీఆర్ ఆగ్రహం
అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన ప్రతిపక్ష సభ్యులు లాబీల్లో టైమ్పాస్ చేస్తున్నారంటూ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం అసెంబ్లీ జరిగేటప్పుడైనా ప్రతిపక్షం తమ పాత్ర సరిగా నిర్వర్తించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలకు సభలో కనీసం 30 నిమిషాలు కూర్చునే ఓపిక లేదని ఎద్దేవా చేశారు. ఎస్సార్డీపీపై ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చే సమయంలో కాం గ్రెస్, బీజేపీకి చెందిన ఒక్కొక్క సభ్యుడు మాత్రమే సభలో ఉన్నారు. దీంతో ఆయన ప్రతిపక్షాల వైఖరిని తూర్పారబట్టారు ‘అసెంబ్లీకి ముందు ఓ బీజేపీ ఎమ్మెల్యే 30 రోజులు సభ నిర్వహించాలని లేఖ రాస్తారు. బీఏసీ మీటింగ్లో 20 రోజులు సభ నిర్వహించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారు. కానీ, సభ జరిగేటప్పుడు మాత్రం ఎవ్వరూ సభలో ఉండరు. ఇదీ వీళ్లకు ప్రజల మీద, వారి సమస్యలపై ఉన్న చిత్తశుద్ధి. వీళ్లా ప్రజల సమస్యలపై పోరాడేది? అంతా కప ట ప్రేమ, నాటకం. అంతా ప్రజలు చూస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట పెద్ద డైలాగ్లు కొట్టడం కాదు.. ప్రభుత్వం సమాధానం చెప్తున్నప్పుడు వినే ఓపిక కూడా ఉండాలని చురకలంటించారు. సభ్యులు అసెంబ్లీ లాబీల్లో ఉండకుండా చూడాలని స్పీకర్ను కోరారు. ‘లేటుగా వచ్చినా.. లేటెస్టుగా వచ్చా..’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పడంతో.. వెంటనే ‘అసెంబ్లీకి వచ్చినందుకు ధన్యవాదాలు’ అని కేటీఆర్ అనడంతో సభంతా నవ్వులు పూసింది.