IT Employees | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగ ఉద్యోగులు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారా? వారి ఓట్లు గెలుపు ఓటమిలను ప్రభావితం చేస్తాయా? ఇదే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగింది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలుగు రాష్ర్టాలకు చెందినవారే కాకుండా ఇతర రాష్ర్టాలవారు కూడా హైదరాబాద్లో ఐటీ కొలువులు చేస్తున్నారు.
ఇక్కడే ఓటుహక్కు నమోదు చేయించుకున్నారు. హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే విస్తరించి ఉన్నది. మాదాపూర్ హైటెక్సిటీ, రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రాంగూడ, పుప్పాల్గూడ, కోకాపేట, మణికొండ, నార్సింగి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో ఐటీ కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే ఉండటం విశేషం. ఈ రెండు నియోజకవర్గాల పధిలో మొత్తం 10,69,771 మంది ఓటర్లు ఉండగా ఇందులో 20-30% మంది ఐటీ ఉద్యోగులు ఉంటారని అంచనా. ఐటీ కారిడార్లోని మొత్తం 10 లక్షల మంది ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 3 లక్షల మంది శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఉంటే, మిగతా వారంతా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్ తదితర నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఐటీ ఉద్యోగుల ఓట్లు కీలకంగా మారతాయని భావిస్తున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్కు సానుకూలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఐటీ రంగంపై ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలు, మౌలిక వసతుల కల్పన, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కార్యాలయాలు నెలకొల్పడం వంటి పరిణామాలు దేశంలోనే హైదరాబాద్ను ఉన్నతస్థానంలో నిలబెట్టాయి. గత పదేండ్లలో హైదరాబాద్లో ఐటీరంగం ప్రగతి పరవళ్లు తొక్కింది. బెంగళూరు నగరాన్నీ వెనక్కి నెట్టింది. భవిష్యత్ ఐటీ రంగ విస్తరణకు సంబంధించిన కార్యాచరణపై ఈ రంగంలోని నిపుణులంతా కేటీఆర్ పనితీరు పట్ల సానుకూలంగా ఉన్నారు. ఐటీ రంగాన్ని నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడం, మెట్రో రైలును నగర నలుమూలలకు విస్తరించడం వంటి చర్యలు ఐటీ రంగం ఉజ్వల భవిష్యత్కు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. ఇవన్నీ ఐటీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పట్ల మంచి అభిప్రాయాన్ని సృష్టించాయి.