హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ)/ఆర్కేపురం, యాదాద్రి భువనగిరి: కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకలా మారిన ఆదాయం పన్ను (ఐటీ) విభాగం మరోసారి ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేసింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో పలు విపక్ష పార్టీల నేతల ఇండ్లు, వ్యాపార సముదాయాల్లో సోదాలు నిర్వహించింది. వందలమంది అధికారులు గుంపులు గుంపులుగా వచ్చి భయోత్పాతం సృష్టించారు. నేతలు, వారి కుటుంబాలను బెదరగొట్టడమే లక్ష్యం అన్నట్టుగా దాడులు కొనసాగాయి. తమిళనాడులో క్యాబినెట్ మంత్రి సెంథిల్రాజ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన రోజే ఐటీ దాడులు కూడా చోటుచేసుకోవటం గమనార్హం.
తెలంగాణలో బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా ఐటీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కొండపల్లి మాదవ్ ఇండ్లు, ఆఫీసులపై బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా సోదాలు చేశారు. ఏకకాలంలో నలుగురు నేతల ఇండ్లపై 87 వాహనాల్లో వచ్చిన 60 బృందాలు విరుచుకుపడ్డట్టు తెలిసింది. ఇంత భారీ ఎత్తున సోదాలకు దిగడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఐటీ దాడి మాదిరిగా లేదని, రాజకీయ దాడిగా ఉన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే శేఖర్రెడ్డి నివాసంతోపాటు ఆయన వ్యాపారానికి సంబంధించిన 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు.
బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం
ఐటీ సోదాలపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. ఐటీ సోదాల సమాచారం తెలుసుకొన్న కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయా నేతల ఇండ్లకు చేరుకొని బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. బీజేపీ డౌన్డౌన్ అని నినాదాలు చేశారు. భువనగిరి పట్టణం, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ కుట్ర పూరితంగానే ఐటీ దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు, కేంద్రానికి వ్యతిరేకంగా ఉండే నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు.
బీజేపీ పాపం త్వరలోనే పండుతుందని, ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. స్వార్థ రాజకీయాలు, ఎన్నికల్లో లబ్ధి కోసం ఉద్దేశపూర్వక దాడులు నిర్వహించి, విపక్షాలను భయాభ్రాంతులు గురిచేయాలనుకోవడం బీజేపీ అవివేకమని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఐటీ దాడులకు భయపడేది లేదని యాదాద్రి భువనగిరి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కే అమరేందర్ స్పష్టంచేశారు.