హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): వలసల జిల్లాగా ముద్రపడ్డ మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా సమీపంలోని దివిటిపల్లి వద్ద ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. శుక్రవారం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో అమరరాజా బ్యాటరీస్ గ్రూప్ 250 ఎకరాల్లో రూ.9,500 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నదని ఒక ప్రకనటలో పేర్కొన్నారు. తొలిదశలో సుమారు 5,000 మందికి, ఆ తర్వాత 10 వేల మంది వరకు ఉపాధి అందించే ఈ పరిశ్రమను మహబూబ్నగర్కు తీసుకొచ్చినందుకు సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.