నాణ్యమైన విత్తనాలు అందించటమే సంస్థ లక్ష్యం
కేసీఆర్ చర్యలతో దేశ విత్తన భాండాగారంగా రాష్ట్రం
దేశ విత్తన అవసరాల్లో 60 శాతం తెలంగాణ నుంచే
ప్రపంచ విత్తన రంగంలో రాష్ర్టానిది ప్రత్యేక స్థానం
దేశంలో ఇస్టా అక్రెడిటెడ్ ల్యాబ్ల సంఖ్య పెంపు
ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికవటం సంతోషంగా ఉన్నది
‘నమస్తే తెలంగాణ’తో ఇస్టా అధ్యక్షుడు కేశవులు
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటమే లక్ష్యంగా ‘ఇస్టా’ పని చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కే కేశవులు తెలిపారు. నాణ్యమైన విత్తనాలపై రైతులకు భరోసా ఇస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో విత్తనోత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకొంటామని, తద్వారా రైతుల ఆదాయం పెంచుతామని పేర్కొన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా ఉన్న కేశవులు ఇటీవల అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం (ఇస్టా) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆసియా నుంచి ఈ పోస్టుకు ఎన్నికైన తొలి వ్యక్తి ఈయనే కావటం గమనార్హం. ఈ సందర్భంగా ఇస్టా అధ్యక్షుడిగా రాష్ట్ర విత్తనరంగ అభివృద్ధికి, విత్తన ఎగుమతుల పెరుగుదలకు, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటానికి తీసుకోబోయే నిర్ణయాలపై ‘నమస్తే తెలంగాణ’తో తన అభిప్రాయాలను పంచుకొన్నారు.
ఇస్టా ప్రధాన ఉద్దేశం ఏమిటి? దీని కార్యకలాపాలు ఎలా ఉంటాయి?
సాగుకు విత్తనమే ఆయువుపట్టు. విత్తనం బాగుంటేనే పంట బాగుంటుంది. పంట బాగుంటేనే దిగుబడి పెరిగి రైతు బాగుంటాడు. అందుకే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటమే ప్రధాన ఉద్దేశంగా 1924లో ఇస్టా ఏర్పడింది. ఇందులో 82 దేశాలకు చెందిన 200లకు పైగా సీనియర్ శాస్త్రవేత్తలు భాగస్వాములుగా ఉన్నారు. వీరంతా విత్తన పరీక్షలపై పరిశోధనలు చేస్తుంటారు. ప్రపంచంలో ఏ దేశమైనా సరే విత్తన పరీక్షల్లో ఇస్టా నిబంధనలు పాటించాల్సిందే. ఈ నిబంధనల ఆధారంగా పరీక్షించిన విత్తనాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. ఒక దేశం నుంచి మరో దేశానికి విత్తనాలు ఎగుమతి చేయాలంటే ఇస్టా అనుమతి తప్పనిసరి. అన్ని దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసే విత్తనాలను ఈ సంస్థ పరిధిలోని, గుర్తింపు పొందిన ల్యాబ్లో పరీక్షించి నాణ్యతను నిర్ధారిస్తారు. ఈ విత్తనాలకు ఇస్టా ఓకే చెప్తేనే మార్కెట్లోకి వస్తాయి.
ఇస్టాతో రాష్ట్ర విత్తనరంగానికి కలిగే ప్రయోజనాలు?
తెలంగాణ విత్తనోత్పత్తికి, పరిశోధనకు ఎంతో అనువైన ప్రాంతం. ఈ నేపథ్యంలో మరిన్ని విదేశీ విత్తన కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆస్కారం ఉన్నది. ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ బిడ్డగా నా వంతు కృషి చేస్తాను. ప్రస్తుతం దేశం నుంచి 1-2శాతం మాత్రమే విత్తన ఎగుమతులు జరుగుతున్నాయి. వాటిని పెంచేందుకు కృషి చేస్తాను. దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న విత్తనాల్లో 90 శాతం తెలంగాణ నుంచే ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో ఆరు ఇస్టా అక్రెడిటెడ్ విత్తన పరీక్ష కేంద్రాలున్నాయి. మరిన్ని ల్యాబ్లకు అక్రెడిటేషన్ వచ్చేలా చర్యలు తీసుకొంటా. తద్వారా విత్తన ఎగుమతులు పెరిగేందుకు అవకాశం కలుగుతుంది.
ఈ పదవి రావటానికి దోహదం చేసిన అంశాలేమిటి?
వందేండ్ల ఇస్టా చరిత్రలో ఆసియా నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తిని నేనే. వరంగల్ జిల్లా ఓ మారుమూల గ్రామానికి చెందిన తెలంగాణ బిడ్డగా ఆ అదృష్టం నాకు దక్కినందుకు సంతోషం. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ప్రపంచ విత్తనరంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. అదే నాకు ఈ అవకాశాలను కల్పించింది. 2007లో ఇస్టాలో నా ప్రస్థానం మొదలైంది. బ్రెజిల్లో జరిగిన సమావేశంలో తొలిసారిగా విత్తన పరీక్షలపై పేపర్ ప్రజెంటేషన్ చేశాను. ఆ తర్వాత 2010 వరకు విత్తన నాణ్యత పరిశోధనల్లో పనిచేశాను. 2010-16 వరకు వివిధ సాంకేతిక పరిశోధన కమిటీల్లో సభ్యుడిగా చేశాను. 2016లో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఎన్నికయ్యాను. 2016-19 వరకు ఇస్టాకు దేశం తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 2019లో హైదరాబాద్లో ఇస్టా అంతర్జాతీయ సదస్సును నిర్వహించాను. ఆ సమావేశంలో ఇస్టా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఇప్పుడు ఈజిప్ట్లో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యా.
విత్తనరంగ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉన్నది?
సీఎం కేసీఆర్ తీసుకొన్న విప్లవాత్మక చర్యలతో ఇప్పటికే తెలంగాణ.. దేశ విత్తన భాండాగారంగా మారింది. ప్రపంచ విత్తనరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొన్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి విత్తనరంగ అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తూనే ఉన్నది. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమై న విధానాలు ఉండటం విత్తనరంగ అభివృద్ధికి దోహదం చేసింది. 2015లో హైదరాబాద్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇస్టా కాంగ్రెస్ సదస్సును నిర్వహించటం విత్తనరంగ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ఇప్పటికే 400కుపైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణ కేంద్రంగా విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్ చేస్తున్నా యి. దేశ విత్తన అవసరాల్లో 60శాతం విత్తనాలు తెలంగా ణ నుంచే ఉత్పత్తి అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
అధ్యక్షుడి హోదాలో రైతులకు ఏం చేస్తారు?
రైతులను విత్తనోత్పత్తి వైపు మళ్లించేందుకు కృషి చేస్తాను. ఇందుకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో స్వయంగా నేనే మాట్లాడి రైతులకు చేరువ చేస్తాను. అనేక కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7 లక్షల ఎకరాల్లో విత్తనోత్పత్తి జరుగుతున్నది. దీన్ని 10 లక్షల ఎకరాలకు పెంచే ఆస్కారం ఉన్నది. ముఖ్యంగా వరి, మక్కజొన్న, కూరగాయల విత్తనోత్పత్తికి భారీ డిమాండ్ ఉన్నది.
విత్తన ఎగుమతుల్లో సమస్యలను ఎలా అధిగమిస్తున్నారు?
దేశం నుంచి విత్తన ఎగుమతులకు అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. వీటి కారణంగానే దేశం నుంచి విత్తన ఎగుమతులు 2 శాతానికి మించి లేవు. విదేశాలకు విత్తనాలను ఎగుమతి చేయాలంటే 13 రకాల అంశాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చీడ పీడలు, విత్తన రకాలు, నాణ్యత, మొలకెత్తే శాతం వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. అయితే వీటిపై పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన దేశంలో లేదు. ఇస్టా అధ్యక్షుడి హోదాలో ఎగుమతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా. సాంకేతికతను ఇక్కడ ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకొంటా. దేశం నుంచి శాస్త్రవేత్తలను ప్రమోట్ చేయటంపైనా దృష్టి పెడతా.