శేరిలింగంపల్లి, జూలై 15: బీటీఎన్జీవోల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్పల్లిలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేస్తున్న నిరసన దీక్షలు బుధవారం 365 రోజులకు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీటీఎన్జీవోల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, సమస్యలను పరిష్కరిస్తారన్న నమ్మకం ఉన్నదని చెప్పారు. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కోర్టు కేసుల కారణంగా ఆందోళన చెందుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీటీఎన్జీవోలవి న్యాయమైన డిమాండ్లని, వారు ఇప్పటికే స్థలాల కోసం డబ్బులు చెల్లించారని, లే అవుట్లను కూడా పూర్తి చేశారని, ప్రభుత్వం వాటికి అనుమతులను కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. బీటీఎన్జీవో ప్రెసిడెంట్ ముత్యాల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ 365 రోజులుగా గాంధేయమార్గంలో నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. తమ నిరసనకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి నాయకులు హాజరై మద్దతు ప్రకటించారని వెల్లడించారు. 140 ఎకరాల ఈ స్థలాన్ని 2008లోనే సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించామని, కొందరు వ్యక్తులు స్థలాన్ని ఆక్రమించాలని చూశారని తెలిపారు. కోర్టుకు వెళ్లి ఆక్రమణదారుల చర్యలను అడ్డుకున్నామని వివరించారు. స్థలాన్ని ఇప్పటికైనా తమకు అప్పగిస్తే రిటైర్డ్ ఉద్యోగులకు ఎంతో ఊరట లభిస్తుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపాలి
ఉద్యోగ, పెన్షనర్లు 365 రోజులపాటు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఎండనక వాననక నిత్యం నిరసన దీక్షలో పాల్గొని మా స్థలాలను మాకు ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలి.
-బీటీఎన్జీవోస్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి
18 మంది మృతిచెందారు
ఏడాది నుంచి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులందరూ ఈ నిరసన దీక్షల్లో పాల్గొంటున్నారు. నిరసన చేపట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు 18 మంది చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మా సమస్యపై స్పందించి బీటీఎన్జీవోలకు న్యాయం చేయాలి.
-బీటీఎన్జీవోస్ డైరెక్టర్ రషీదా బేగం
సొంతింటి కలను సాకారం చేయాలి
ప్రభుత్వం ఇప్పటికైనా మాపై దయ చూపించి సొంతింటి కలను సాకారం చేయాలి. ఎన్నో సంవత్సరాలుగా విధి నిర్వహణలో సేవలందించి ఉద్యోగ విరమణ పొంది సొంతింటి కల నెరవేర్చుకోలేక నిరాశతో ఎదురుచూడాల్సి వస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా కలను సాకారం చేయాలి.
-బీటీఎన్జీవోస్ డైరెక్టర్ సంధ్యారాణి