వరంగల్ : కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించ లేదని అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణానికి రావాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు. శనివారం వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చీఫ్ విప్తో పాటు పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, మాజీ పార్లమెంటు సభ్యుడు సీతారాం నాయక్ మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై అత్యంత దుర్మార్గంగా, అహంకార పూరితంగా కేంద్ర మంత్రి రాజ్యసభలో సమాధానమివ్వడం విచారకరమని అన్నారు.
విభజన హామీలపై కేంద్ర బీజేపీ కేవలం వద్దు,రద్దు విధానాన్ని మాత్రమే ఎంచుకుందని విమర్శించారు. రాష్ట్రంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కలలను బీజేపీ కల్లలు చేసిందని ఆరోపించారు. కోచ్ పరిశ్రమల అవసరం దేశంలో ఇక లేదని అస్సాం రాష్ట్రంలోని కోక్రాజహార్ ప్రాంతానికి ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నించారు. అన్నీ పరిశ్రమలను గుజరాత్ కు తరలించుకుపోతున్న బీజేపీ ని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనికిరాడని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీసే దమ్ము,ధైర్యం అతడికి లేవని దుయ్యబట్టారు. ‘ బయ్యారం ఫ్యాక్టరీ వీలు కాదన్నారు . ఇపుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కుదరదు అంటున్నారని’ మండిపడ్డారు. తెలంగాణ హక్కులను సాధించుకోవడానికి కేంద్రంలో ఎంతకైనా తెగించి పోరాడుతామని వారు స్పష్టం చేశారు. పార్లమెంట్ సాక్షిగా పొందుపరిచిన రాష్ట్ర పునర్విభజన హామీలను అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందన్నారు.
గిరిజన విశ్వవిద్యాలయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించి కేంద్రానికి అప్పగించినప్పటికీ ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అత్యంత బాధాకరమైన అంశమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్,మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకులు పులి రజినీకాంత్, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్,59వ డివిజన్ అధ్యక్షులు నీలం సుహాస్,బీఆర్ఎస్వీ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్,డాక్టర్ పాలమకుల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.