Irrigation projects | సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన క్రమంగా ప్రాజెక్టుల పనులను పూర్తిచేస్తుండడంతో అదే రీతిలో రాష్ట్రంలో ఆయకట్టు విస్తరిస్తూ పోతున్నది. శరవేగంగా ప్రాజెక్టుల ఫలాలు రైతులకు అందుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వానాకాలం సీజన్లో 40.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఇరిగేషన్శాఖ సిద్ధం చేసిన యాక్షన్ప్లానే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. నిరుడు వానాకాలంలో 39.35 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించగా, ఈ ఏడాది ఏకంగా 40.56 లక్షల ఎకరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే పలు ప్రాజెక్టుల కింద నీటి విడుదలను ప్రారంభించారు.
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం వానకాలం సాగుకుగాను భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తంగా 40.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సాగునీటిశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సంబంధిత యాక్షన్ప్లాన్పై ప్రాంతాల వారీగా ఆయా చీఫ్ ఇంజినీర్ల నుంచి ఈఎన్సీ మురళీధర్ ఇప్పటికే వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ప్రాజెక్టుల వారీగా నీటినిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలపై ఇటీవల సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మొత్తంగా ఈ ఏడాది వానకాలం సీజన్లో అన్ని ప్రాజెక్టుల కింద 40.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు ప్రాజెక్టుల కింద ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీటిని విడుదలను ప్రారంభించారు. నిరుడు తరహాలోనే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో అంటే 8 రోజులు ఆన్, 7 రోజుల ఆఫ్ పద్ధతిలో ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
గోదావరి బేసిన్లో పూర్తి ఆయకట్టుకు
ఎగువన మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోనూ ఈసారి గోదావరి బేసిన్లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో బేసిన్లోని ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరుతోపాటు మిడ్మానేరు, ఎల్ఎండీ తదితర ప్రాజెక్టులన్నీ ఇప్పటికే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందివ్వాలని కమిటీ నిర్ణయించింది. ఎన్నడూ లేనివిధంగా ఎస్సారెస్పీ స్టేజ్ 2 కింద నిరుడు 3.30 లక్షల ఎకరాలకు సాగునీరందడమే రికార్డుకాగా, ఈ ఏడాది అది ఏకంగా 3.58 లక్షల ఎకరాలకు పెరుగడం విశేషం. ఆదిలాబాద్ టెరిటోరియల్లోని కడెం, సదర్మాట్, సాత్నాల, మత్తడివాగు, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల కింద మొత్తంగా 1.59 లక్షల ఎకరాలకు, నిజాంసాగర్, కౌలస్నాలా, పోచారం ప్రాజెక్టుల కింద 1.43 లక్షల ఎకరాలకు, నిజామాబాద్లోని అలీసాగర్, గుత్పా, చౌటుపల్లి, రామడుగు ప్రాజెక్టుల కింద 1.41 లక్షల ఎకరాలకు, సంగారెడ్డిలోని సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల కింద 46 వేల ఎకరాలకు, మంచిర్యాలలోని గొల్లవాగు, నీల్వాయి, ర్యాలివాగు, ఎన్టీఆర్ సాగర్, వట్టివాగు, కుమ్రంభీం, పీపీరావు ప్రాజెక్టుల కింద 70 వేల ఎకరాలకు, ఖమ్మంలో వైరా, లంకసాగర్ ప్రాజెక్టుల కింద 27 వేల ఎకరాలకు, కొత్తగూడెంలో కిన్నెరసాని, పెద్దవాగు, తాలిపేరు, ఎల్టీ బయ్యారం ప్రాజెక్టుల కింద 44 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదనలు రూపొందించారు.
కాళేశ్వరం కింద 18.29 లక్షల ఎకరాలకు
సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త, స్థిరీకరణ కలుపుకొని మొత్తంగా 18.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుండటం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిరుడు కొత్త ఆయకట్టు 70 వేల ఎకరాలు ఉండగా, ఈ సారి 98 వేల ఎకరాలకు పెరిగింది. ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపి మరో 30 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్టు ద్వారా 18.45 లక్షల ఎకరాలను స్థిరీకరించాల్సి ఉండగా, అందులో ఈ ఏడాది గరిష్ఠంగా 16.99 లక్షల ఎకరాలను సాగునీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ స్టేజీ 2, ఎల్ఎండీ దిగువ ఎస్సారెస్పీ స్టేజ్-1 ఆయకట్టుకు కాళేశ్వరం నుంచే సాగునీరు అందనున్నది.
నాగార్జునసాగర్ కింద 6.20 లక్షల ఎకరాలకు
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురిసి ఆయా రాష్ర్టాల్లోని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటినిల్వ మట్టానికి చేరుకొన్నాయి. ఇటీవలే నీటిని దిగువకు విడుదల చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ జూరాల.. ఇప్పటికీ శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు మాత్రం ఆశించిన స్థాయిలో జలాలు రాలేదు. రెండు ప్రాజెక్టుల్లో నామామాత్రంగానే జలాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఎగువ నుంచి వరద వస్తుండటం, వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు ఆచితూచి ప్రణాళికలను రూపొందించారు. నాగార్జునసాగర్ ఎడమకాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్, హైలెవల్ కెనాల్, లో లెవల్ కెనాల్, ఆసిఫ్నగర్, డిండి, మూసీ, ప్రియదర్శిని జూరాల, నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్, కోయిల్సాగర్, భీమా-1, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద నిరుడు కంటే స్వల్పమొత్తంలో ఆయకట్టును తగ్గించి ఎస్సీఐఈఏఎం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నీటి లభ్యతను అనుసరించి ఆయకట్టుకు నీళ్లివ్వాలని నిర్ణయించారు.