గోపాల్పేట, ఆగస్టు 11 : కేఎల్ఐ డీ-8 కాలువపై సూపర్ ప్యాసేజ్ (ఎస్పీ) పనులు చేపట్టినా క్యూరింగ్ చేయకపోవడం, ఎస్పీ కింద వేసిన మట్టిని తొలగించకపోవడం, ప్రస్తుతం కాలువకు నీటిని వదిలితే ముందుకు పారే అవకాశం లేకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం చాకల్పల్లి శివారులో ఎస్పీ పనులు జరుగుతున్న కేఎల్ఐ డీ-8 కాలువ వద్దకు రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు.
అక్కడే వారు మీడియాతో మాట్లాడుతూ.. కాలువల ద్వారా కేఎల్ఐ నీటిని వదిలి చెరువులు, కుంటలు నింపి సకాలంలో సాగునీరు అందించాల్సిన ప్రభుత్వం.. నీటిని విడుదల చేసే సమయంలో డీ-8 కాలువపై సూపర్ ప్యాసేజ్ పనులు అడ్డంగా చేపట్టారని మండిపడ్డారు. కాలువకు అడ్డంగా మట్టి పోసి ఎస్పీ పనులు చేపడితే నీళ్లు ఎలా ముందుకు పారుతాయని కాంట్రాక్టర్, అధికారులను ప్రశ్నించారు. ఎండాకాలంలో చేపట్టాల్సిన పనులు ఇప్పుడు చేయడం సరికాదని అన్నారు. సూపర్ ప్యాసేజ్ పనులకు క్యూరింగ్ సరిగ్గా చేయలేదని ఆరోపించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా సాగునీరు అందించాలని అధికారులను డిమాండ్ చేశారు.