హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 18 : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు ఉదయం ఉత్తిష్ఠ గణపతికి కాకతీయుల కాలం నాటి ప్రాచీనకోనేరు తీర్థ బిందాభిషేకం గందోధికాభిషేకం నిర్వర్తించి స్వామివారిని శుక్రవారం సర్ప గణపతిగా అలంకరించారు. ప్రముఖ శివ భక్తురాలు మంజుల అందించిన ఆంధ్ర రాజధాని అమరావతిలోగల కాలేశ్వరరావు మార్కెట్ నుంచి తెప్పించిన మల్లె, గులాబీ, చామంతి, ఎర్రగులాబి, పసుపుగులాబీ లక్షగణపతి నామాలతో లక్ష పుష్పార్చన నిర్వర్తించారు.
అనంతరం స్వామివారిని పద్మ వాహనంపై వాహనసేవ నిర్వర్తించారు. పూజా దాతలుగా ప్రముఖ వస్త్ర వ్యాపారి మహేంద్ర కపూర్ రాజ్ కరాని ఉభయదాతలుగా వ్యవహరించారు. సాయంత్రం దేవులపల్లి శ్రీవిద్య శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వర్తించారు. శుక్రవారం కావడంతో వేలాదిగా భక్తులు దేవాలయాన్ని సందర్శించి గణపతి నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో డి.అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. గంగపుత్ర సంఘం జిల్లా నాయకుడు గరిగ అశోక్, అంబటి రాజు అన్నదాన సేవలో పాల్గొని సేవలందించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, మణికంఠశర్మ, ప్రణవ్శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.