– నల్లగొండ రైతుల పొలాలు ఎండుతుంటే నీళ్లు తరలిస్తారా?
– భట్టి చెప్పగానే ఉత్తమ్ ‘ఓకే’.. తూములన్నీ మూసేయిస్తారా!
– రైతుల ప్రయోజనాలను గాలికొదిలిన ఉత్తమ్
– సింగారెడ్డిపాలెం విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజం
పెన్పహాడ్, సెప్టెంబర్ 18 : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి ఖమ్మం జిల్లాకు నీటిని తరలించడమేంటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఎడమ కాల్వ తూములన్నీ మూసివేసి ఇక్కడి రైతులకు సాగు, తాగు నీరు అందకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులు పంటలను కాపాడుకునేందుకు నీటి కోసం ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు. పెన్పహాడ్ మండలంలోని సింగారెడ్డిపాలెంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగదీశ్రెడ్డి మాట్లాడారు. సాగర్ ఎడమ కాల్వ కింద రైతులు ఇప్పటికే పంటలు సాగు చేశారని, ప్రస్తుతం నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాల్వ తూములు మూసి నీటిని మరో జిల్లాకు తరలించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఖమ్మం జిల్లా పరిధిలోని బోనకల్, ముదిగొండ, చింతకాని, మధిర ప్రాంతాలకు సాగర్ ఎడమ కాల్వ నీటిని తరలించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారని జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఆ ఆదేశాలకు జిల్లా మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అంగీకరించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తూములను మూసివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘ఉప ముఖ్యమంత్రి చెప్పగానే.. జిల్లా మంత్రి అంగీకరించారా? మరి నల్లగొండ రైతుల పరిస్థితి ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడి రైతులకు సాగునీరు అందించిన తర్వాత మిగిలిన నీటిని ఎక్కడికైనా తరలిస్తే తమకు అభ్యంతరం లేదని.. కానీ నల్లగొండ ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా తరలించడం అన్యాయమన్నారు.
ఎడమ కాల్వ తూములు తెరవకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించేలా ఆదేశాలు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటని జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. రైతులకు నీరు అందించాల్సిన అధికార యంత్రాంగంతో తూముల వద్ద కాపలా పెట్టించి నీరు వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. మూడు రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఎడమ కాల్వ ఆయకట్టుకు నీరు అందడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. కాల్వలో నీరు పారుతూఉన్నప్పటికీ ఆయకట్టు తూములను మూసివేస్తే రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు.
వరి సాగు కోసం రైతులు పెట్టుబడులు పెట్టారని, నీరు అందకపోతే ఆ పెట్టుబడులు మొత్తం నష్టపోయే ప్రమాదం ఉందని జగదీశ్రెడ్డి అన్నారు. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం ఖర్చు చేసిన రైతులు పంటను కాపాడుకునేందుకు నీటి కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. “రైతు పంట ఎండిపోతే బాధ్యత ఎవరిది? నీటి కోసం రైతు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?” అని ఆయన ప్రశ్నించారు. సాగర్ జలాల విషయంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్లే ఆయకట్టులో గందరగోళం నెలకొందన్నారు.
సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు ఎంత నీరు, ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం వెంటనే స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు ముందుగానే నీటి విడుదలపై సమాచారం ఇస్తే పంటల నిర్వహణకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఆయకట్టు రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. సాగర్ నీటిపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒక ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం మరో ప్రాంత రైతుల పంటలను ఎండబెట్టే విధానం సరికాదన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. సాగర్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించి నల్లగొండ, సూర్యాపేట ఆయకట్టు రైతుల పంటలను కాపాడాలని, అనంతరం అవసరమైన మేరకు ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలన్నారు. రైతులకు వెంటనే సాగునీరు అందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, పీఏసీఎస్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, మాజీ మండలాధ్యక్షులు దొంగరి యుగేందర్, సతీష్ పాల్గొన్నారు.